‘ఐక్యతకు మారుపేరు మా ఊరు’.. 60 ఏళ్లుగా ఏకతాటిపై గ్రామస్తులు.. ఆ గ్రామం ఎక్కడంటే?

కులాలు మతాల పేరుతో నిత్యం ఏదో ఒకచోట దాడులు చోటు చేసుకుంటున్నాయి.

Update: 2024-09-16 02:21 GMT

కులాలు మతాల పేరుతో నిత్యం ఏదో ఒకచోట దాడులు చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ప్రస్తుత తరుణంలో ఓ గ్రామంలో అన్ని కులాలు, మతాలకు సంబంధించిన ప్రజలంతా ఏళ్ల తరబడి కలిసికట్టుగా పండుగలు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. అంతేకాకుండా గ్రామీణ కళలకు అక్కడ ప్రజలు నేటికీ జీవం పోస్తున్నారు. అలా నిర్వహించుకున్న క్రమంలో ఏ సందర్భంలోనూ చిన్నపాటి భేదాభిప్రాయాలు కూడా లేకుండా అంతా ఐక్యంగా కలిసిపోతున్నారు. చుట్టుపక్కల గ్రామాల అన్నింటికీ ఆ గ్రామం ఆదర్శ నిలుస్తోంది. ఆ గ్రామం మరెక్కడో కాదు నల్గొండ జిల్లాలోని మాడుగులపల్లి మండలంలోని కేశవాపురం గ్రామం.

దిశ, నల్గొండ బ్యూరో:కులాలు మతాల పేరుతో నిత్యం ఏదో ఒకచోట దాడులు చోటు చేసుకుంటున్నాయి. అటువంటి ప్రస్తుత తరుణంలో ఓ గ్రామంలో అన్ని కులాలు, మతాలకు సంబంధించిన ప్రజలంతా ఏళ్ల తరబడి కలిసికట్టుగా పండుగలు ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. అంతేకాకుండా గ్రామీణ కళలకు అక్కడ ప్రజలు నేటికీ జీవం పోస్తున్నారు. అలా నిర్వహించుకున్న క్రమంలో ఏ సందర్భంలోనూ చిన్నపాటి భేదాభిప్రాయాలు కూడా లేకుండా అంతా ఐక్యంగా కలిసిపోతున్నారు. చుట్టుపక్కల గ్రామాల అన్నింటికీ ఆ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఆ గ్రామం మరెక్కడో కాదు నల్గొండ జిల్లాలోని మాడుగుల పల్లి మండలంలోని కేశవాపురం గ్రామం.

ఊరంతా ఒకే గణనాథుడు..

గతంలో ఏడు గ్రామాలు కలిపి ఒకే గ్రామపంచాయతీగా కొనసాగిన కేశవాపురం. మాడుగులపల్లి మండలంలోని కేశవాపురం గ్రామంలో ప్రస్తుతం సుమారు 400 లకు పైగా నివాస గృహాలు ఉండగా దాదాపు 1400 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఎస్సీ, బీసీ ఇతర ఉన్నత కులాల వారు నివాసం ఉంటున్నారు. అయినప్పటికీ కులమతాలకు అతీతంగా కుటుంబ సంబంధాలతో కలిపి పలకరించుకుంటుంటారు. అందరూ కలిపి ఒకే మాట మీద ఉండి ఐక్యంగా జీవిస్తుంటారు. పండుగలు, ఉత్సవాలు అన్ని కుల మతాలకు అతీతంగా నిర్వహించుకుంటారు. అందులో భాగంగానే సుమారు 60 సంవత్సరాలకు పైగా ఆ గ్రామంలో ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒకే ఒక వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తుంటారు.

ఈ పూజలలో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొంటారు. గ్రామంలో ఉన్న దాదాపు 5 ముస్లిం కుటుంబాలు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయకుడి విగ్రహం వద్ద పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కూడా కొడుతుంటారు. అంతేకాకుండా నవరాత్రి ఉత్సవాలు పూర్తయిన రోజు గణేశుడి శోభాయాత్రలో వినాయకుడి విగ్రహం ముస్లింల ఇంటి ముందుకు వెళ్లిన సందర్భంలో మైనార్టీలు నిండుకుండతో నీటిని తెచ్చి ఆరబోసిన సందర్భాలు మన కళ్లముందు స్పష్టంగా కనిపిస్తుంటాయి.

గ్రామంలో కళలకు జీవం..

గ్రామం చిన్నది అయినప్పటికీ అక్కడ కళలకు పెట్టింది పేరు. పదేళ్ల పాప నుంచి 70 ఏళ్లకు పైగా ఉన్న స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా అందరూ పాటలు పాడడం, కోలాటం వేయడం, యక్షగానం, భజనలు చేస్తుంటారు. ఏళ్ల తరబడి ప్రతి శనివారం సాయంత్రం ఊరంతా దేవాలయం వద్దకు చేరుకుని రకరకాల పాటలతో ప్రజలంతా కోలాటం, భజనలు, యక్షగానం వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళారూపాలు ప్రదర్శించే రోజు అందరూ తమ సెల్ ఫోన్లు ఇంటి దగ్గర పెట్టి మరి గుడి దగ్గరికి చేరుకుంటారు. పూర్తిగా కళారూపాలను ప్రదర్శిస్తూనే తమ కష్టసుఖాలను కూడా మర్చిపోతుంటారు. అంతేకాకుండా గ్రామీణ కళలను పరోక్షంగా ప్రత్యక్షంగా పెంచి పోషిస్తున్నారు. ఈ గ్రామస్తులకు కళలను కాపాడుకోవడం, కళాకారులను గౌరవించడం అంటే ఎంతో ఇష్టం.

ఉత్సవాలన్నీ కూడా కలిసే..

గ్రామాల్లో సహజంగా ఆయా కులాలకు సంబంధించిన దేవతల పండుగలు ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. కానీ కులానికి ఆ కులం విడివిడిగా వాళ్ల వాళ్ల దేవతలకు సంబంధించిన పండుగలు జరుపుతారు. కానీ ఆ గ్రామంలో మాత్రం శ్రీరామనవమితో పాటు గ్రామదేవతల ఉత్సవాలు, ముస్లిం వర్గాలకు సంబంధించిన పీర్ల పండుగను కూడా అన్ని వర్గాల ప్రజలు కలిసి జరుపుకుంటారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో దళితులకు ఇతర కింది కులాలకు దేవాలయ ప్రవేశం లేదు. కానీ కేశవాపురంలో మాత్రం అందరితోపాటు దళితులకు కూడా దేవాలయానికి వెళ్లి నేరుగా పూజలు చేసుకుంటారు.

ఐక్యతకు మారుపేరు మా ఊరు..

మా ఊరు ఐక్యతకు మారుపేరు. గ్రామంలో ఏ విషయంపై నిర్ణయం తీసుకోవాలన్నా అందరం కలిసి తీసుకుంటాం. కులమతాలకు సంబంధం లేకుండా ఊరివాళ్లంతా ఉత్సాహంగా నిర్వహించుకుంటాం అని మోహన్ అనే కేశవపురం గ్రామస్తుడు చెబుతున్నారు. నేను పుట్టక ముందు నుంచే.. బజారు ఒక విగ్రహం పెట్టి పండుగలను పల్సన చేస్తున్న కాలంలో మా ఊరిలో గత 60ఏళ్లకు పై నుంచి ఒకే విగ్రహం పెడుతున్నారు. ఎంతో సంబురంగా నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు విడివిడిగా కలిసి పూజలు నిర్వహిస్తుంటాం. ఇప్పటివరకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మా ఆనవాయితీని కొనసాగిస్తున్నాం. సుధాకర్ రెడ్డి అనే కేశవాపురం గ్రామస్తుడు తెలిపారు.


Similar News