Sama RamMohan Reddy : అధికారం పోగానే బీఆర్ఎస్‌కు అల్జీమర్స్? సామ రామ్మోహన్ రెడ్డి విమర్శలు

అధికారం పోగానే బీఆర్ఎస్‌కు అల్జీమర్స్ వచ్చిందా? అంటూ టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.

Update: 2024-09-01 11:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారం పోగానే బీఆర్ఎస్‌కు అల్జీమర్స్ వచ్చిందా? అంటూ టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో జ‌రిగిన ఘోరాల‌ను అధికారం కోల్పోగానే మ‌ర్చిపోయిన‌ట్టున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అస‌మ‌ర్ద పాల‌న‌లో ఒక్క‌టా రెండా.. వంద‌లాది ఘ‌ట‌న‌లు వేలాది మంది విద్యార్ధులు ఆసుప‌త్రుల పాలయ్యారన్నారు. ‘అన్నంలో పురుగులు.. పప్పులో వానపాములు, గురుకులాల్లో జరుగుతున్న ఘోరాలెన్నో, విద్యార్థుల ప్రాణాలతో సర్కారు చెలగాటం, రాష్ట్రవ్యాప్తంగా వరుసగా ఘటనలు, ఆస్పత్రి పాలవుతున్న విద్యార్థులు, గురుకులాలు.. స‌మ‌స్య‌ల నిల‌యాలు, సంక్షేమ హాస్టల్లలో ఆకలి కేకలు, కుళ్ళిన కూరగాయలు.. ముక్కిన బియ్యం, ఉపాసముంటున్న పిల్లలు’ నాటి పత్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాలే బీఆర్ఎస్ చేత‌గాని త‌నానికి నిద‌ర్శ‌నాలని ఆరోపించారు.

గత పాలనలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని, ఎట్లా తినాలి అంటూ మీర్ పేట (సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గం) పోలీస్ స్టేషన్ లో నాలుగో తరగతి విద్యార్థిని పూజిత ఫిర్యాదు చేసిందని వెల్లడించారు. ఇలా చెప్పుకుంటు పోతే గురుకుల విద్యార్ధులు గత పాలనలో నిత్య న‌ర‌కాన్ని అనుభ‌వించారన్నారు. ఆ స‌మ‌స్య‌ల సుడిగుండం నుంచి గురుకులాల‌ను బ‌య‌ట‌ప‌డేసేందుకు తమ ప్ర‌భుత్వం చిత్త‌శుద్దితో పనిచేస్తుందన్నారు. ప‌దేళ్ల పాపం ఒక్క‌ రోజుతోనే ఒక్క నెల‌లోనే అంతం అయ్యేది కాదన్నారు. గురుకులాల్లో అందిస్తున్న బోజ‌నం పై రాజీ ప‌డ‌కుండా గురుకుల విద్యార్ధుల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్నాం, ఇంకా మెరుగుపరుస్తాం.. అని పేర్కొన్నారు.


Similar News