KTR : ఈ చిట్టి నాయుడు మ‌న‌కు ఓ లెక్క కాదు.. బీఆర్ఎస్వీ సమావేశంలో కేటీఆర్ ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపుల‌కు భ‌య‌ప‌డం.. అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

Update: 2024-10-17 10:11 GMT

దిశ, డైనమిక్, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపుల‌కు భ‌య‌ప‌డం.. అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గుంపు మేస్త్రీ అంటే క‌ట్టేతోడు.. కానీ ఇతను కూల్చేటోడు అని కేటీఆర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ రాష్ట్ర సదస్సులో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పోరాటమనేది బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఏమీ కదన్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, ఈ చిట్టి నాయుడు మ‌న‌కు ఓ లెక్క కాదని ఫైర్ అయ్యారు. నదులు ఎక్కడ ఉన్నాయో, విప్రో చైర్మన్ ఎవరు తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి.. అలాంటి వ్యక్తి మనకు సీఎం కావడం మన దౌర్భాగ్యమన్నారు. నేడు రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చిన తెలంగాణ భవన్ హక్కున చేర్చుకుంటుంది.. వారికి అండగా ఉంటుందని తెలిపారు.

జీవో 29 వల్ల గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, గ్రూప్ 1 అభ్యర్థుల కోసం అశోక్ నగర్ పోదామని అనుకుంటే అశోక్ నగర్ చుట్టూ పోలీసులు ఉన్నారని తెలిపారు. గ్రూప్ 1అభ్యర్థులే తెలంగాణ భవన్ కు వచ్చారు.. వారికి అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లికీ మూటలు తీసుకుని పోతుండు.. ఇప్పటి వరకు 25 సార్లు ఢిల్లీ పోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. తులం బంగారం ఏమైంది అన్నందుకు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. రాష్ట్రంలో మూసీ పేరుతో పేదల ఇండ్లు కూల్చుతుంటే బీజేపీ మౌనంగా ఉంటుందన్నారు.

కాంగ్రెస్, బీజేపీల పైన బీఆర్ఎస్ పోరాడాలి

రాష్ట్రంలో బీజేపీ మరింత ప్రమాదకరమైన పార్టీ.. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల పైన బీఆర్ఎస్ పోరాడాలని, ప్రతి జిల్లాలో బీఆర్ఎస్వీ సదస్సు పెట్టుకోవాలని, కమిటీలు వేసుకోవాలని సూచించారు. నా కంటే అద్భుతంగా మాట్లాడే నాయకులు బీఆర్ఎస్వీలో ఉన్నారని, మీడియా ప్రభుత్వానికి కొమ్ము కాస్తోందన్నారు. అందుకే సోషల్ మీడియాలో మనం యాక్టివ్ గా ఉండాలన్నారు.

ప్రతి కాలేజీలో బీఆర్ఎస్వీ జెండా, బ్యానర్ ఉండాలి

రాష్ట్రంలో ప్రతి కాలేజీలో బీఆర్ఎస్వీ జెండా, బ్యానర్ ఉండాలన్నారు. ఆ విధంగా విద్యార్థులు పోరాటం చేయాలని, అప్పుడు విద్యార్థి ఉద్యమాల నుంచి వారికి భవిష్యత్తు ఉంటుందన్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుస్తున్నామనే ధీమానే మనల్ని కొంప ముంచిందన్నారు. మేము అంతే ధీమాలో ఉండడంతో ఓడిపోయామన్నారు. చిన్న చిన్న పొరపాట్లు చేశాం, వాటిని సవరించుకుందాం, ప్రజలకు దగ్గర అవుదాం విద్యార్థి నాయకులదే భవిష్యత్, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్ దో కాదు మన అందరిదీ. ఇంకో 50 నుంచి 75 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని పిలుపునిచ్చారు.


Similar News