కేసీఆర్ కు కనువిప్పు బడ్జెట్

కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం అప్పగించిన ప్రజల నమ్మకాన్ని చూరగొంటామని మంత్రి పొంగులేటి అన్నారు.

Update: 2024-07-25 12:31 GMT

కేసీఆర్ కు కనువిప్పు బడ్జెట్

– ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

దిశ, తెలంగాణ బ్యూరో:

కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం అప్పగించిన ప్రజల నమ్మకాన్ని చూరగొనే విధంగా, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా నడుచుకుంటామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో తొలిసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందన్నారు. ప్రజాపాలనకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉంది. రాష్ట్ర ప్రజలు ఏదైతే కావాలని కోరుకున్నారో, ఏదైతే ఆశించారో వారి అభిలాషకు అనుగుణంగా ఉందన్నారు. ఎవరూ ప్రవేశపెట్టలేని, ఎవరూ అమలు చేయలేని పథకాలను ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని అమలుపరుస్తుందన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన హామీలను, ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా బడ్జెట్ రూపొందించి నిధులు కేటాయించిందన్నారు. బడ్జెట్ ను చీల్చి చెండాడుతామని ప్రతిపక్ష నేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ బడ్జెట్ గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ కు ఒక కనువిప్పుగా ఉందన్నారు. తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ బడ్జెట్ ను విమర్శించడానికి కూడా ఏమి లేదు. మొదటిసారి వచ్చారని, ఏదో ఒకటి మాట్లాడాలని తన సహజ ధోరణిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ రాష్ట్రాన్ని వారు ఆర్థికంగా ఎంతో చిన్నాభిన్నం చేసి, తెలంగాణ సమాజం కోలుకోలేని దెబ్బ తీశారు. ముఖ్యమంత్రిగా చీల్చి చెండాడి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే ధోరణిలో మాట్లాడడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది నెలల క్రితమే చీల్చి చెండాడి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఎన్నో అన్యాయాలతో, అక్రమాలతో అవినీతితో ఖాళీ ఖజానాను మా ప్రభుత్వానికి అప్పగించారన్నారు. ఎంతో సమర్థవంతంగా ప్రజాభిష్టానికి అనుగుణంగా ప్రతిపక్షంలోని కొంత మంది పెద్దలు నోరు మెదపడానికి కూడా రాని విధంగా బడ్జెట్ ను ప్రవేశపెడితే, ఇటువంటి ప్రజారంజక బడ్జెట్ ను చీల్చి చెండాడుతారా అని ప్రశ్నించారు.


Similar News