TGS RTC: తెలంగాణ ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్..! కార్మిక సంఘాల డిమాండ్స్ ఇవే?
తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ.. తెలంగాణ (Telangana)లోని ఆర్టీసీ (RTC) కార్మికులు దాదాపు నాలుగేళ్ల తరువాత మళ్లీ సమ్మే బాట పట్టనున్నారు.

దిశ, వెబ్డెస్క్: తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ.. తెలంగాణ (Telangana)లోని ఆర్టీసీ (RTC) కార్మికులు దాదాపు నాలుగేళ్ల తరువాత మళ్లీ సమ్మే బాటపట్టనున్నారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బస్ భవన్ (Bus Bhavan)లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar)కు కార్మిక సంఘాల నాయకులు సమ్మె నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఉద్యోగులు తరలి రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఆర్టీసీ జేఏసీ (RTC JAC) పిలుపునిచ్చింది.
కార్మిక సంఘాల డిమాండ్స్ ఇవే!
ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఆర్టీసీ (RTC)లో కార్మికుల హక్కులను కాల రాస్తున్నారని ఆరోపించారు. సర్వీసుల్లో ఉన్న వారి సమస్యలు అటుంచితే.. రిటైర్డ్ అయిన వారి సమస్యలను ఇంకా పరిష్కారం కాలేదని అన్నారు. పెద్ద ఎత్తున పెండింగ్లో బకాయిలు ఉన్నాయని తెలిపారు. పే స్కేళ్ల పెంపు విషయంలో ఇప్పటి వరకు ముందడుగు పడలేదని అన్నారు. డీఏ (DA) బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదని ఆరోపించారు. యూనియన్ల ఏర్పాటు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాలను ప్రభుత్వం విస్మరించిందని పేర్కొన్నారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలను సవరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. హక్కుల సాధన, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్ధిక, ఇతర హామీల అమలుకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు జేఏసీ స్పష్టం చేసింది.