TG Govt.: నిరుద్యోగ యువతకు తీపి కబురు.. నేటి నుంచి అమల్లోకి కొత్త పథకం
రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తేనున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తేనున్నది. వీటి ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రూ. 3 నుంచి రూ. 5 లక్షల రుణాలు ఇవ్వనున్నది. సంక్షేమ శాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల సహాకారంతో ఈ స్కీమ్ ను అమలు చేయనున్నారు. కాగా, ఏప్రిల్ ఐదో తేదీ లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రూ. 6వేల కోట్లతో పథకాన్ని అమలు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి తగ్గకుండా సాయం చేయనున్నట్టు ఇప్పటికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నేడు ఈ స్కీమ్ దరఖాస్తుల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
డిప్యూటీ సీఎం సమీక్ష
రాజీవ్ యువ వికాసం అమలుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదివారం సమీక్షించారు. ప్రధానంగా పథకం విధి విధినాలపై చర్చించారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ స్కీమ్ ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ఈ స్కీమ్ ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. సమీక్షలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు ప్రీతమ్, బెల్లయ్య నాయక్, ఒబేదుల్ల కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.