TDP: తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం షురూ.. కార్యకర్తలతో మాట్లాడిన చంద్రబాబు

రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది.

Update: 2024-10-26 15:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కాగా తెలంగాణ సభ్యత్వ నమోదు ప్రక్రియను వర్చువల్ గా ప్రారంభించారు. కాగా మొదటి సభ్యత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ(Telugu Desam Party) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌(Palla Srinivas) చేతుల మీదుగా చంద్రబాబు సభ్యత్వాన్ని తీసుకున్నారు. అనంతరం ఆయన కార్యకర్తలనుద్దేశించి జూమ్‌లో మాట్లాడారు. బడుగు, బలహీనవర్గాల నుంచి చదువుకున్న వారిని పెద్ద ఎత్తున రాజకీయ అవకాశాలను కల్పించిన పార్టీ తెలుగుదేశం(Telugu Desam Party) అని కొనియాడారు. పార్టీకి పటిష్ట యంత్రాంగం ఉందని, దీనిని కొనసాగించుకోవడానికి సభ్యత్వ నమోదు కార్యక్రమమే పునాది అని ఆయన వివరించారు.

ప్రతి ఒక్క నాయకుడు సభ్యత్వ నమోదును చేయించాలన్నారు. 45 రోజులు సభ్యత్వ నమోదుకు సమయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన, ఇబ్బందులు పడిన కార్యకర్తలతో చంద్రబాబు(Chandrababu) మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు(Bakkani Narasimhulu) మాట్లాడుతూ.. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు తిరునగరి జ్యోత్స్న, నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర నాయకులు కాట్రగడ్డ ప్రసూన, బండిపుల్లయ్య, సామభూపాల్‌ రెడ్డి, వాసిరెడ్డి రామనాథం, టీజీకే మూర్తి, అజ్మీరా రాజునాయక్‌, గడ్డి పద్మావతి, కూరపాటి వెంకటేశ్వర్లు, జీవీజీ నాయుడు, షేక్‌ అరిఫ్‌, బేతు జగదీష్‌ రెడ్డి, నెల్లూరి దుర్గాప్రసాద్‌, మ్యాడం రామేశ్వర్‌ రావు, శ్రీనివాసనాయుడు, ఏఎస్ రావు, తెలంగాణ టీడీపీ పార్టీ మీడియా సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, సతీష్‌కుమార్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News