తెలంగాణ అధికారిక చిహ్నం వివాదం! (CAG) కాగ్ లోగోను కాపీ చేశారు?

తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు నిర్ణయం వివాదస్పదంగా మారింది. అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-30 10:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు నిర్ణయం వివాదస్పదంగా మారింది. అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అమరుల త్యాగాలు ఉట్టిపడేలా చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రకారుడు రుద్ర రాజేశం 12 నమూనాలను తయారు చేయగా వాటిలో ఒక దాన్ని ప్రభుత్వం ఎంపిక చేయనున్నది. అయితే కొత్త ఎంబ్లమ్ ఇదేనంటూ కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాయి. ఈ కొత్త చిహ్నంపై భాగాన మూడు సింహాలతో కూడిన రాజముద్ర ఉండగా కాకతీయ తోరణం, చార్మినార్ స్థానంలో అమరవీరుల స్థూపం, అమరవీరుల స్తూపాన్ని ఆనుకూని ఇరు వైపుల వరికంకులను పొందుపరిచారు.

వాటి చుట్టూ జాతీయ జెండా మూడు రంగులతో రూపొందించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూతో పాటు హిందీలోనూ రాసి ఉంది. అయితే ప్రభుత్వం చిహ్నం ఇదే అని ఇంకా ఫైనల్ కాలేదు. కానీ దాదాపు ఇదే చిహ్నం అని లోగో వైరల్ అవుతుంది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందించాయి. (CAG) కాగ్ లోగో కాపీ చేసి.. కాంగ్రెస్ జెండా యాడ్ చేశారని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. దానికి సంబంధించిన లోగోలను పోస్ట్ చేస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఆవిష్కరణ విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. తెలంగాణ తల్లి, కొత్త చిహ్నం ఆవిష్కరణపై సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. దీంతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేవలం రాష్ట్ర గీతం మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News