తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

రాష్ట్రంలో ఉద్యోగుల‌కు భద్రత లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూట‌రీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు లింగమొల్ల దర్శణ్ గౌడ్, విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.

Update: 2024-10-02 12:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగుల‌కు భద్రత లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూట‌రీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు లింగమొల్ల దర్శణ్ గౌడ్, విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంట‌నే పాత పెన్షన్ విధానాన్ని పున‌రుద్ధరించాలన్నారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర క‌మిటీ స‌మావేశం బుధ‌వారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో సీపీఎస్‌ నూతన కమిటీని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా కె.రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడిగా లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా విజయ్ భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 2.50 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్ష సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ విధానం రద్దు చేశారని గుర్తు చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం హర్షనీయమన్నారు. దశాబ్ద కాలంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు చే‌స్తున్న పోరాటాన్ని గుర్తించి సీపీఎస్ విధానం రద్దు చేయాల‌న్నారు. ఈ విధానం రద్దు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమని ఉద్యోగులు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని గుర్తు చేశారు. పాత పెన్షన్ ప్రకటన కోసం 2.50 లక్షల ఉద్యోగుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయ‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి వీలైనంత త్వరగా ఈ విధానం రద్దు చేసి మరణించిన, పదవీ విరమణ పొందిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్స్, బదిలీలు చేపట్టి ఉద్యోగుల విశ్వాసం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అశాస్త్రీయమైన విధానాన్ని రద్దు చేసి వారి వృద్ధాప్య జీవితానికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఉప్పెరి విజయ్ భాస్కర్, కోశాధికారిగా మారం లింగారెడ్డి, ఉపాధ్యక్షులుగా లెక్కల వీరేశం, మంగ నర్సింహులు, భూలక్ష్మి, జాయింట్ సెక్రటరీగా నాగవెల్లి ఉపెందర్, అసోసియేట్ అధ్యక్షులుగా శిరందాసు రామదాసు, సందీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తిరుపతి, శోభన్, శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


Similar News