Telangana Congress: మహారాష్ట్ర ఎమ్మెల్యేపై తెలంగాణలో కేసు నమోదు

రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మహారాష్ట్ర ఎమ్మెల్యేపై తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు కేసు నమోదు చేశారు.

Update: 2024-09-17 12:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మహారాష్ట్ర ఎమ్మెల్యేపై తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు కేసు నమోదు చేశారు. శివసేన ఎమ్మె్ల్యే సంజయ్ గైక్వాడ్ పై నల్గొండ జిల్లా, శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కేసు నమోదు చేసి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

కాగా మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన సంజయ్ గైక్వాడ్ అనే ఎమ్మెల్యే సోమవారం రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాలుకను నరికి తెచ్చిన వారికి రూ. 11 లక్షలు రివార్డును అందజేస్తానని సంచలన ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. శివసేన ఎమ్మెల్యేపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Similar News