దేశానికే రోల్ మోడల్‌గా స్కిల్ యూనివర్శిటీ.. వారిదే కీలక భాగస్వామ్యం

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు.

Update: 2024-09-19 17:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని వారికి పిలుపునిచ్చారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి సహకారమందించినందుకు వాటికి దాతల పేర్లు పెట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహింద్రతో పాటు సభ్యులతో సచివాలయంలో గురువారం తొలి సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా సీఎం పై క్లారిటీ ఇచ్చారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

స్కిల్ యూనివర్శిటీపై ప్రభుత్వం తన ఆలోచనలను వెంటనే ఆచరణలో పెట్టిందని, ఆ బాధ్యతను బోర్డు ఛైర్మన్ మహీంద్రా ఆనంద్‌కు అప్పగిస్తున్నామని సీఎం ఈ సమావేశంలో తెలిపారు. పారిశ్రామికవేత్తగా ఆయనకున్న అనుభవంతో పాటు సమాజంలో ఉన్న ప్రత్యేక గుర్తింపుతో స్కిల్ యూనివర్సిటీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకువస్తారనే నమ్మకం ఉందన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఆవశ్యకతను, ఆలోచనను, ఆచరణను, భవిష్యత్తు లక్ష్యాన్ని ఈ సమావేశంలో బోర్డు చైర్మన్, కో-చైర్మన్, సభ్యులతో పాటు పలు రాష్ట్రాల నుంచి హాజరైన వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో సీఎం పంచుకున్నారు.

ఉపాధికి తగిన స్కిల్స్ లేవు :

డిగ్రీ, పీజీ పట్టాలు ఉంటే మాత్రమే సరిపోదని, ఉపాధి అవకాశాలకు తగిన నైపుణ్యం కూడా అవసరమని సీఎం రేవంత్ నొక్కిచెప్పారు. , ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసిన లక్షలాది మంది యువకులు ఒక ఉద్యోగం ఇప్పించాలంటూ తరచూ తన దగ్గరకు వస్తున్నారని కొన్ని అనుభవాలను గుర్తుచేశారు. ఏటేటా లక్షలాది మంది యువకులు డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారని, కానీ అందరూ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని పేర్కొన్నారు. మరోవైపు పరిశ్రమల అవసరాలకు సరిపడే మానవ వనరులు దొరక్క పరిశ్రమల అధిపతులు కూడా సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ అంతరాన్ని తొలగించేందుకు స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పాలనే ఆలోచన చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. డిగ్రీలు, పీజీలు పూర్తిచేసిన యువతీ యువకులందరికీ సరిపడేంత స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని, అందువల్లనే వివిధ రంగాలతో పాటు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తే ఉపాధికి ఢోకా ఉండదనే ఆలోచనతో ఈ స్కిల్ యూనివర్శిటీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

వచ్చే నెల నుంచే కోర్సులు ప్రారంభం :

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోర్సుల్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత అక్టోబర్ నెలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ)లో తాత్కాలికంగా కోర్సులను నిర్వహించనున్నట్లు తెలిపింది. తొలుత హెల్త్ కేర్, ఈ-కామర్స్, లాజిస్టిక్స్ కోర్సులను ప్రారంభించనున్నామని, వీటి నిర్వహణకు అపోలో హాస్పిటల్‌తో పాటు ఏఐజీ (ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(, లెన్స్ కార్ట్, ఫ్లిఫ్‌కార్ట్, అమెజాన్, అల్ కార్గో, ప్రొ-కనెక్ట్, ఓ-9 సొల్యూషన్స్ తనితస మవై కంపెనీలు ముందుకొచ్చాయని బోర్డు చైర్మన్ ఆనంద్ మహింద్రా వివరించారు. తొలి ఏడాది రెండు వేల మందికి అడ్మిషన్లు ఇచ్చి ఆ కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహింద్రా, కో-చైర్మన్ శ్రీని రాజు, బోర్డు సభ్యులు పి.దేవయ్య, సుచిత్రా ఎల్లా, సతీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరికొద్దిమంది బోర్డు సభ్యులైన మనీష్ సభర్వాల్, సంజీవ్ బిక్చందానీ, ఎంఎం మురుగప్పన్, డాక్టర్ కేపీ కృష్ణన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణకు సత్తా ఉంది; ఆనంద్ మహీంద్రా

తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహింద్రా ప్రశంసించారు. మంచి విజన్ ఉన్న సమర్థ నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కొనియాడారు. అందుకే బోర్డు చైర్మన్‌గా ఉండాలని సీఎం కోరగానే ఒప్పుకోవాల్సి వచ్చిందన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాయని, కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆలోచించిన తీరులోనే దార్శనికత ఉన్నదని అభినందించారు. తెలంగాణలో అతి పెద్ద యూఎస్ కాన్సులేట్ ఉందని, ఎక్కువ మంది ఇక్కడి నుంచే అమెరికాకు వెళుతున్నారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించే గమ్యస్థానంగా తెలంగాణ నిలబడుతుందనడంలో సందేహం లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కల నిజం కావాలని, ఆయన ఆశయం నెరవేరాలనే ఆకాంక్షను వ్యక్తంచేశారు.

ఆకర్షణీయ గమ్యస్థానంగా హైదరాబాద్ : మంత్రి శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నదని, ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మేధోమధనం చేసి స్కిల్ యూనివర్శిటీకి అంకురార్పణ చేశారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇలాంటి ఆలోచనల్లో భాగంగానే కొత్తగా ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)ని ప్రభుత్వం నెలకొల్పుతున్నదని గుర్తుచేశారు. ఇప్పటికే అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి స్వీయ ఆలోచనతో త్వరలోనే స్కిల్ యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రారంభమవటం ఆనందంగా ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్రంలో ఒకవైపు పరిశ్రమల స్థాపన పెరగడం, విదేశాల నుంచి కొత్త యూనిట్లను నెలకొల్పడానికి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వస్తున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తగిన స్కిల్స్ కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్న ఆలోచన నుంచే ఈ యూనివర్శిటీ పుట్టుకొచ్చిందన్నారు.

స్పోర్ట్స్ వర్శిటీకీ సహకారమందించండి : సీఎం అప్పీల్

యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్శిటీని స్థాపించిన ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తల నుంచి సహకారం అందడం సంతోషంగా ఉందన్న సీఎం రేవంత్‌రెడ్డి... త్వరలో రాబోతున్న స్పోర్ట్స్ వర్శిటీకి కూడా ఇదే తరహాలో స్పందించాలని అప్పీల్ చేశారు. ఇక నుంచి ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందన్నారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పి.. 2028 ఒలింపిక్స్ పోటీల్లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తామన్నారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పారిశ్రామికవేత్తలకు సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల ఇబ్బంది లేదని దాదాపు రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో వెయ్యి కోట్లు ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నదన్నారు. ఆర్థిక సహకారానికి మించి, రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపార-వాణిజ్యవేత్తలు చొరవ ప్రదర్శించాలని కోరారు. తగిన భాగస్వామ్యం, బాధ్యతలను పంచుకోవాలని అప్పీల్ చేశారు.


Similar News