Telangana Bhavan: రూ.600 కోట్లతో తెలంగాణ భవన్.. ఢిల్లీలో నిర్మాణానికి డిజైన్లు రెడీ

దేశ రాజధాని ఢిల్లీలో రూ.600 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భవన్‌ను నిర్మించ తలపెట్టింది.

Update: 2024-08-28 02:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో రూ.600 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భవన్‌ను నిర్మించ తలపెట్టింది. ఈ భవన్ నిర్మాణానికి అవసరమైన డిజైన్లు సిద్ధమయ్యాయి. ఆ డిజైన్లు ప్రస్తుతం ఆర్కిటెక్చర్ కంపెనీల నుంచి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారుల వద్దకు చేరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీటిని త్వరలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేయనున్నారు. ఒకచోట మూడు ఎకరాల్లో సీఎం, గవర్నర్ గెస్ట్ హౌజ్‌ను, మరోచోట ఐదెకరాల్లో రాష్ట్రం నుంచి వచ్చే నేతలకు గెస్ట్ రూమ్స్‌తో కూడిన భవనాన్ని నిర్మించనున్నారు. అయితే.. ఈ నిర్మాణాలన్నీ రెండేండ్లలోపు పూర్తి చేసేలా సర్కారు వ్యూహరచన చేస్తున్నది.

24 అంతస్తులతో తెలంగాణ టవర్..!

హస్తినాలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ప్రకారం తెలంగాణ భవన్‌‌ను, ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లను గత మార్చిలో డివైడ్ చేశారు. 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించారు. ఈ మొత్తం ఆస్తి విలువ రూ.9,913.505 కోట్లుగా కేంద్ర హోంశాఖ గతంలోనే ప్రకటించింది. అయితే.. తెలంగాణకు వచ్చిన మూడెకరాల్లో శబరి బ్లాక్‌ ఉండగా, 5.245 ఎకరాల్లో పటౌడీ హౌస్‌ ఉంది. ప్రస్తుతం శబరి బ్లాక్‌ ఉన్న ప్రాంతంలో గవర్నర్‌, ముఖ్యమంత్రి, రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రులకు విడివిడిగా బ్లాక్‌లు నిర్మించాలని, మిగిలిన 5.245 ఎకరాల్లో రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, అధికారులు వెళ్లినప్పుడు ఉండేలా గదులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. కేంద్ర పట్టణ ప్రణాళిక (టౌన్‌ ప్లానింగ్‌) నిబంధనల ప్రకారం ఇక్కడ బహుళ అంతస్తులు నిర్మించుకునే వెసులుబాటు ఉన్నది. ఇప్పటికే ఆర్‌అండ్‌‌బీ అధికారులు రెండు-మూడు నమూనాలను రూపొందించారు. 24 అంతస్తులతో తెలంగాణ టవర్‌ను నిర్మించనున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

త్వరలో సీఎం రేవంత్ రివ్యూ..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఆర్అండ్‌బీ అధికారులకు ఆదేశించగా.. ఆ మేరకు అధికారులు ఆర్కిటెక్చర్స్‌కి సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన మేరకే డిజైన్లు సిద్ధం చేసినట్టు తెలిసింది. అయితే.. వీటిని సీఎం ఫైనల్ చేయాల్సి ఉంది. కొన్ని రోజులుగా సీఎం బిజీబిజీగా ఉండటంతో అప్రూల్ కాలేదని ఆర్అండ్‌బీ అధికార యంత్రాంగం వెల్లడిస్తున్నది. తొందరలోనే ఈ డిజైన్లను అప్రూవ్ చేసేందుకు బిల్డింగ్ విభాగ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం ఉంటుందని ఆ శాఖ ఆఫీషియల్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్రూవ్ అయిన తర్వాత టెండరింగ్ ప్రాసెస్, దానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై దృష్టి సారిస్తామని ఆర్అండ్‌బీలోని ఓ కీలక అధికారి మీడియాకు వెల్లడించారు.


Similar News