కాంగ్రెస్‌లోకి తలసాని? ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మాజీ సీఎం!

బీఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

Update: 2024-07-02 07:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ క్రమంలో నెక్స్ట్ ఎవరనేది ఆసక్తిగా మారింది. వివాదాలకు ఆస్కారం లేని నియోజకవర్గాల్లోని నేతలను తొలుత పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో కీలకంగా ఉన్న సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సైతం పార్టీ మారబోతున్నారని ప్రచారం గుప్పుమంటోంది. అన్నీ సజావుగా జరిగితే త్వరలోనే ఆయన కండువా మార్చడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

అఖిలేశ్‌తో సన్నిహిత సంబంధాలు..

తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేరిక విషయంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఏఐసీసీ పెద్దలతో రాయబారం నడుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2014లో టీడీపీ తరఫున గెలుపొందిన తలసాని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో టీడీపీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత రెండుసార్లు మంత్రిగా పని చేశారు. అయితే తలసానికి, అఖిలేశ్ యాదవ్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో పాటు వీరిద్దరికీ చాలాకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో యూపీ సీఎంగా ఉన్న సమయంలో అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లోని తలసాని నివాసానికి సైతం వచ్చారు. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం నేపథ్యంలో తలసాని కాంగ్రెస్‌లోకి వచ్చేలా అఖిలేశ్ మార్గం సుగమం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది.

ఉండేదెవరు? వచ్చేదెవరు?..

బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యేల సంఖ్య చాపకింద నీరులా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే తాను పార్టీ మారడం లేదని ఇదివరకే తలసాని క్లారిటీ ఇచ్చినా ఇప్పటివరకు జరిగిన చేరికల నేపథ్యంలో తలసాని విషయంలో ఊహాగానాలు ఆగడం లేదు. నిజానికి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలలో మెజార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు సన్నిహితులుగా పేరున్నవారే. వీరిలో చాలామంది కేసీఆర్‌ను కలిసి తాము పార్టీని వీడటం లేదని చెప్పినవారే. అయితే వారంతా అనూహ్యంగా పార్టీ కండువా మార్చి బీఆర్ఎస్‌కు ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలో చేరికల విషయంలో కాంగ్రెస్ తలుపులు తెరుచుకునే ఉన్నాయని దీపా దాస్‌మున్షీ సైతం వ్యాఖ్యానించడంతో తలసాని ఇష్యూపై ఉత్కంఠ నెలకొన్నది. ఇక ఇదిలా ఉంటే కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా బీఆర్ఎస్‌లో మిగిలే ఎమ్మెల్యేలు ఎంత మంది? కాంగ్రెస్‌లోకి వచ్చేదెంతమంది? అనేది వేచిచూడాలి.

Tags:    

Similar News