ఈడీ చేతికి గొర్రెల స్కీమ్ కీలక నివేదిక

రూ.700 కోట్ల గొర్రెల స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-10-05 09:55 GMT

దిశ, వెబ్ డెస్క్ : రూ.700 కోట్ల గొర్రెల స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వెటర్నరీ డిపార్ట్మెంట్ స్కీమ్‌ మార్గదర్శకాలు, లబ్ధిదారుల జాబితాను ఈడీకి అందజేసింది. మరోవైపు స్కీమ్ కు సంబంధించి పూర్తి రిపోర్ట్‌ను ఈడీ, ఏసీబీలకు గొర్రెలు‌, మేకల పెంపకందారుల సమాఖ్య అందచేసింది. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ స్కామ్ కేసును మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్‌ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్‌ కార్యాలయం సంయుక్త సంచాలకుడు గతంలో లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి? వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.

అదేవిధంగా గొర్రెల రవాణా ఏజెన్సీల సమాచారం, వాటికి జరిగిన చెల్లింపుల వివరాలు, గొర్రెలకు కొనుగోలు చేసిన దాణా, దాన్ని ఏయే లబ్ధిదారులకు పంపించారు? దీని కోసం ఎవరికి నిధులిచ్చారనే అనే అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం కావాలని తెలిపింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వండని ఆ లేఖలో పేర్కొంది. ఈ మేరకు తాజాగా సమాఖ్య పూర్తి రిపోర్ట్‌ను అందించింది. ఇప్పటికే గొర్రెల స్కామ్‌ కేసులో ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. మాజీ డైరెక్టర్ రామచందర్, మొయినుద్దీన్, అక్రముద్దీన్‌లను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ విచారణ చేస్తోంది. ఇప్పటివరకు పది మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా పశుసంవర్ధకశాఖ సీఈవో రామ్‌చందర్‌నాయక్, మాజీ ఓఎస్డీ కల్యాణ్‌కుమార్‌లను ఏసీబీ అధికారులు గతంలో అరెస్టు చేశారు. 


Similar News