High Court on N Convention: ఎన్ కన్వెన్షన్ ఇష్యూ.. నాగార్జున పిటిషన్ పై హైకోర్టు సంచలన నిర్ణయం

ఎన్ కన్వెన్షన్ ఇష్యూ లో హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది.

Update: 2024-08-24 09:07 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మాదాపూర్ లోని తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఫిర్యాదులతో శనివారం ఉదయం హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. హైడ్రా చర్యపై ఎన్ కన్వెన్షన్ యజమాని, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురామ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా అంశాలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఎన్ కన్వెన్షన్ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, పూర్తిగా పట్టాభూమిలోనే నిర్మాణాలు చేపట్టిందని కోర్టుకు వివరించారు. గతంలోనే ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలకు పాల్పడిందని నోటీసులు ఇస్తే దానిపై హైకోర్టును ఆశ్రయించామని, ఆ సమయంలో స్టే కూడా ఉందని, ఆ స్టే నోటీసులను లెక్క చేయకుండా తాజా కూల్చివేతలపై ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కన్వెన్షన్ హాల్ ను కూల్చివేశారని వాదించారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించారని కోర్టుకు తెలుపగా వాదనలు విన్న న్యాయస్థానం కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇవాళ ఉదయం ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేసిన హైడ్రా అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో తుమ్మిడి చెరువును ఆక్రమించుకుని చేపట్టిన మరికొన్ని నిర్మాణాలను సైతం కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.


Similar News