Railway Station: ఐకానిక్ భవనం ఇక కనిపించదు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూల్చివేత
హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భనవన ఆకృతి అందరికీ సుపరిచితమే. ఒక కోటలా ఉంటుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) భనవన ఆకృతి అందరికీ సుపరిచితమే. ఒక కోటలా ఉంటుంది. ముఖ్యంగా ఆ రైల్వే స్టేషన్ అంటే గుర్తొచ్చేది ముఖద్వారం. ఇకపై ఆ ఐకానిక్ స్టేషన్ భవనం కనిపించదు. ఎందుకంటే.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన.. రైల్వే స్టేషన్ భవనాన్ని తాజాగా నేలమట్టం చేశారు. ఆధునికీకరణ పనుల్లో భాగంగా స్టేషన్లో కూల్చివేతల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ హార్చ్ గోడలను నేలమట్టం చేశారు.
1874 లో నిజాం, బ్రిటీష్ కాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించారు. నిజాం ఆధీనంలో ఉండే ఈ స్టేషన్.. 1950 తర్వాత భారత రైల్వే (Indian Railway) పరిధిలోకి వచ్చింది. కళా సంస్కృతికి చిహ్నంగా నిలిచిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. నేడు అధునీకరణ పేరుతో కూల్చి వేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్టు తరహాలో నిర్మించాలని (South Central Railway) దక్షిణమధ్య రైల్వే ప్లాన్ చేసింది. అత్యాధునిక హంగులతో రీ డెవలప్ చేయాలని, రూ.653 కోట్ల అంచనాతో ఎస్సీఆర్ టెండర్లకు పిలిచింది. ఇక ప్రస్తుతం వందల సంఖ్యలో రైళ్లు, దాదాపు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.