CM Revanth: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు: సీఎం రేవంత్ కీలక నిర్ణయం

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దెబ్బతిన్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. సమూల ప్రక్షాళనతో పాటు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నది.

Update: 2024-07-19 17:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో దెబ్బతిన్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం.. సమూల ప్రక్షాళనతో పాటు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నది. ఇప్పటికే టీచర్ల రిక్రూట్‌మెంట్ కోసం కసరత్తు మొదలైంది. త్వరలోనే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి యూనివర్శిటీలకు వైస్ చాన్సెలర్ల నియామకం మొదలు గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళను నెలకొల్పడం వరకు అనేక అంశాలపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పలువురు విద్యాధికులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో విద్యారంగంలో తీసుకురావాల్సిన మార్పులపై లోతుగా సమీక్ష జరిగింది. వారి అభిప్రాయాలను పరిగణనలోక తీసుకున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వీలైనంత త్వరగా కార్యాచరణ మొదలుపెట్టాలని నిర్ణయించారు. చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై విధివిధానాల డాక్యుమెంట్‌ను తయారుచేయాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.

విద్యారంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం:

రాష్ట్రంలో విద్యా వ్యవ‌స్థను మెరుగుప‌ర్చడానికి త్వర‌లోనే విద్యా క‌మిష‌న్ ఏర్పాటు చేయ‌నున్నట్లు క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అంగ‌న్‌వాడీ, ప్రాథ‌మిక పాఠ‌శాల‌ల మొద‌లు విశ్వ విద్యాల‌యాల వ‌ర‌కు నాణ్యమైన విద్యా బోధ‌న‌, నైపుణ్య శిక్షణ‌, ఉపాధి క‌ల్పన‌ ప్రభుత్వ లక్ష్యాలని నొక్కిచెప్పారు. విద్యా వ్యవస్థ బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా 11 వేల‌కుపైగా ఉపాధ్యాయ పోస్టుల నియామ‌కాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల, ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహణ, పాఠ‌శాల‌లు తెరిచిన రోజే పిల్లలంద‌రికీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, ‘అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల క‌మిటీ’ల ద్వారా పాఠ‌శాల‌ల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్పన తదితర అంశాల పురోగతిపై విద్యావేత్తలకు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వివరించారు. ప్రభుత్వ పాఠ‌శాల‌ల వ్యవ‌స్థ బ‌లోపేతానికి అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్యలు తీసుకుంటామ‌ని, విద్యావేత్తలు ఇచ్చే మంచి సూచ‌న‌లు స్వీక‌రిస్తామ‌ని స్పష్టంచేశారు.

ప్రీ-స్కూళ్ళుగా అంగన్‌వాడీ కేంద్రాలు:

గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు చదువు కోసం పక్క ఊర్లకు వెళ్ళాల్సి వస్తున్నదని, ఫలితంగా విద్యకు దూరమవుతున్నారని సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పాఠశాలలు మూతపడితే ఇప్పుడు కొత్తవి ఓపెన్ చేస్తున్నామని విద్యావేత్తలకు ఈ సమావేశంలో వివరించారు. అంగన్‌వాడీలను ప్లే స్కూళ్ళ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీఎం తెలిపారు. స్థానికంగానే ప్లే స్కూళ్ళు ఉంటే అంగన్‌వాడీ తరహాలో 3వ తరగతి దాకా అక్కడే చదువుకునే అవకాశం లభిస్తుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో విద్యాబోధన కోసం ఒక టీచర్‌ను నియమించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

4వ తరగతి నుంచి అవకాశాన్నిబట్టి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయాన్ని ప్రభుత్వమే కల్పించేలా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లకు సమాంతరంగా సెమీ-రెసిడెన్షియల్ స్కూళ్లను కొనసాగించనున్నామన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని గుర్తుచేశారు. దశలవారీగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు.

యూనివర్శిటీల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి:

ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు సమావేశానికి హాజరైన ప్రొఫెస‌ర్లు హ‌ర‌గోపాల్‌, కోదండ‌రాం, పీఎల్‌ విశ్వేశ్వర‌రావు, శాంతా సిన్హా, అల్థాస్ జాన‌య్య, ప‌ద్మజా షా, ల‌క్ష్మీనారాయ‌ణ, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళి విద్యా వ్యవ‌స్థ బ‌లోపేతానికి సంబంధించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న స‌మ‌స్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. అంగ‌న్‌వాడీల్లో కార్యక‌ర్తలకు బోధించే నైపుణ్యం ఉండ‌డం లేద‌ని, స‌రైన వ‌స‌తులు లేవ‌ని వీరు వెల్లడించడంతో వాటిని ప్రీ-స్కూళ్లుగా మార్చి వాలంటీర్లను నియమిస్తామని, ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సీఎం బదులిచ్చారు. ప‌దేళ్లుగా యూనివ‌ర్సిటీల్లో బోధ‌న సిబ్బంది నియామ‌కం జ‌ర‌గ‌లేద‌ని, వీసీలు కూడా లేర‌ని ప్రొఫెస‌ర్లు ప్రస్తావించారు. వీసీల నియామ‌కానికి ఇప్పటికే సెర్చ్ క‌మిటీలను వేశామ‌ని, త్వర‌లోనే నియామ‌కం పూర్తవుతుంద‌ని ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు.

యూనివ‌ర్సిటీల‌కు డెవ‌ల‌ప్‌మెంట్ గ్రాంట్స్ ఇవ్వాల‌ని, ప్రతి యూనివ‌ర్సిటీలో వివిధ అంశాల‌పై లోతైన చ‌ర్చ, వాస్తవాల వెల్లడికి, అభివృద్ధి చ‌రిత్రకు సంబంధించిన అధ్యయ‌న కేంద్రాలను ఏర్పాటు చేయాల‌ని ప్రొఫెస‌ర్ అల్థాస్ జాన‌య్య ముఖ్యమంత్రిని రిక్వెస్టు చేశారు. విద్యా సూచిక‌లో తెలంగాణ అట్టడుగున‌ ఉన్నద‌ని, తామంతా ఉస్మానియా విశ్వ విద్యాల‌యంలోనే చ‌దువుకున్నామ‌ని, అనేక దేశాల్లోని యూనివర్శిటీల్లో రీసెర్చి, ప్రాజెక్టు వర్క్స్ చేశామని గుర్తుచేశారు. ప్రత్యేక గుర్తింపు ఉన్న ఉస్మానియా యూనివర్శిటీలో విద్యా ప్రమాణాలు ఇటీవల ప‌డిపోయాయ‌ని ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌, ప్రొఫెస‌ర్ శాంతా సిన్హా ఆవేద‌న వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం.. విద్యా వ్యవ‌స్థ బ‌లోపేతానికి ఇప్పటికే మంత్రులు శ్రీ‌ధ‌ర్‌బాబు, సీత‌క్క, పొన్నం ప్రభాక‌ర్‌ల‌తో కేబినెట్ స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని వివరించారు.

పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించండి:

విద్యా వ్యవ‌స్థలో తక్షణం తీసుకురావ‌ల్సిన మార్పుల‌పై విధాన ప‌త్రం (పాలసీ డాక్యుమెంట్) రూపొందిస్తే దానిపై చ‌ర్చించి ప్రభుత్వం చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆయా అంశాల‌పై కేబినెట్ స‌బ్ క‌మిటీతోనూ చ‌ర్చించాల‌ని వారికి సూచించారు. విద్యా వ్యవ‌స్థ బ‌లోపేతానికి ప్రపంచ బ్యాంకు, ఏషియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు అతి తక్కువ వ‌డ్డీకి, దీర్ఘకాల రుణాలు ఇస్తాయ‌ని, ఇప్పటికే ప‌లు రాష్ట్రాలు వాటి సాధ‌న‌కు ప్రయ‌త్నిస్తున్నాయ‌ని ప్రొఫెస‌ర్ ఆల్దాస్ జాన‌య్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ అంశాన్ని కూడా ప‌రిశీలిస్తామ‌ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా శాఖకు 11% బ‌డ్జెట్ ఉండేదని, తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత అది 6.4 శాతానికి ప‌డిపోయింద‌ని, బ‌లోపేతం చేయాలంటే బ‌డ్జెట్‌ను పెంచాల్సిన అవసరం ఉన్నదని ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న చాలా మంది ప్రపంచ స్థాయి పరిశోధకులుగా, మేధావులుగా గుర్తింపు పొందారని, తనతో పాటు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క కూడా ప్రభుత్వ పాఠ‌శాలల్లోనే చ‌దువుకున్నవారమేనని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవ‌స్థ బ‌లోపేతానికి కచ్చితంగా బ‌డ్జెట్‌ను పెంచుతామ‌న్నారు. విద్యా వ్యవ‌స్థలో విప్లవాత్మక మార్పులు తేవాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశమని, బ‌డ్జెట్ కేటాయింపులు త‌ప్పకుండా పెరుగుతాయని డిప్యూటీ సీఎం (ఆర్థిక మంత్రి కూడా ఆయనే) క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేవంలో ప్రభుత్వ స‌లహాదారు కేశ‌వ‌రావు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యద‌ర్శి శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యద‌ర్శి మాణిక్‌రాజ్‌, విద్యా శాఖ ముఖ్య కార్యద‌ర్శి బుర్రా వెంక‌టేశం పాల్గొన్నారు.


Similar News