మనకి ఆ బాధ్యత లేదా..? : సీఎం రేవంత్ సూటి ప్రశ్న

చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలకు గురవుతున్నాయని, ఇక మూసీ కూడా పూర్తిగా కబ్జా అయిపోతే ఆ తరువాతి కాలంలో అనంతగిరి నుంచి వచ్చే వరద నీటిని హైదరాబాద్ ఎలా భరించగలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Update: 2024-10-05 09:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: పేదోడి బాధ ఎలా ఉంటదో తనకి తెలుసని, జీవితాంతం కష్టపడి కట్టుకున్న ఇల్లు కూలిపోతే వాళ్ల బాధ ఎలా ఉంటుందో తాను అర్థం చేసుకోగలనని, 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న తనకి పేదల బాధ ఎలా ఉంటుందో తెలుసని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే వాళ్లని ఎలా ఆదుకోవాలో ప్రతిపక్షాలు కూడా చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జీ వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలకు గురవుతున్నాయని, ఇక మూసీ కూడా పూర్తిగా కబ్జా అయిపోతే ఆ తరువాతి కాలంలో అనంతగిరి నుంచి వచ్చే వరద నీటిని హైదరాబాద్ ఎలా భరించగలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

‘‘ఈ రోజున హైదరాబద్ నగరంలో 1200, 1400 ఫీట్ బోర్ వేయకుండా ఎక్కడా నీళ్లు రావడం లేదు. హైదరాబాద్ నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. గ్రౌండ్ వాటర్ పడిపోయింది. హైదరాబాద్ మురికితో మూసీ నిండిపోయి ఆ విషవాయువులు నల్గొండ ప్రజలకు విషంగా మారుతోంది. నల్గొండని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా. మా ప్రభుత్వానికి ఎవరిమీదా కోపం కానీ, పట్టింపులు కానీ లేవని, కేవలం ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచనే లేదు’’ అని సీఎం పేర్కొన్నారు.

అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఇంచార్జి మినిస్టర్ పొన్నం ప్రభాకర్‌తో కలిసి ముఖ్యమైన నాయకులందరినీ పిలిచి మూసీ నిర్వాసితులకు ఎలా న్యాయం చేయాలో చర్చించాలని కోరారు. అలాగే ప్రతిపక్షాలిచ్చే సూచలని ప్రభుత్వం స్వీకరిస్తుందని, ఉద్యోగాల కోసం వలసలు వచ్చి పేదరికంతో మూసీ మురికి కూపాల్లో బతుకుతున్న వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి, మెరుగైన వసతి కల్పించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేస్తే.. వాటిని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. కాకా వెంకటస్వామి స్ఫూర్తితో పేదలకు జీవితాల్లో వెలుగులు తీసుకొద్దామని పిలుపునిచ్చారు.

అవసరమైతే రేస్ కోర్సుని బయటకు తరలిద్దామని, అప్పుడు 150 ఎకరాల స్థలంలో పేదలకు పక్కా ఇళ్లు కట్టించొచ్చని, లేకపోతే అంబర్ పేటలో పోలీస్ అకాడెమిని సిటీ బయటకు తరలిస్తే 200 ఎకరాలు స్థలం ఉంటుందని, ఇదంతా ప్రభుత్వ భూమి కాబట్టి అందులో అయినా మూసీ నిర్వాసితులకు ఇళ్లు కట్టించొచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు సూచనలు చేయాలని, ప్రభుత్వం కమిటీ వేస్తుందని, అవసరమైతే ఆ కమిటీలో కేటీఆర్, ఈటల రాజేందర్‌ని కూడా సభ్యులుగా పెడతామని అన్నారు. ప్రతిపక్షాలతో కలిసి పనిచేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్.. అందరూ కలిసి పేదలకోసం ఏం చేయాలో ఆలోచన చేద్దామని సీఎం రేవంత్ పిలుపుపిచ్చారు.


Similar News