దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. పోలీసులపై తొలి కేసు నమోదు

Update: 2024-08-16 10:54 GMT

దిశ, షాద్ నగర్ః రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గత నెల 30వ తారీఖున దళిత మహిళ సునీతపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం ఎంత సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో దళిత మహిళ సునీత ఈనెల 11వ తారీఖున ఫిర్యాదు చేశారు. అదే రోజు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది కానీ పోలీసులు మాత్రం గోప్యంగా పెట్టారు. షాద్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత మహిళ సునీత దినసరి కూలీ ఆమెకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. జులై 30 తేదీన దొంగతనం చేసిందనే నెపంతో సాయంత్రం 6 గంటల సమయంలో స్టేషన్ కు తీసుకెళ్లారు. మహిళ అని కూడా చూడకుండా సునీతకు నిక్కరు తొడిగి, ఇద్దరు పోలీసులు తొడలపై నిలబడి చేతులు వెనక్కు పెట్టి బెల్టుతో కొట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితె పెట్రోలు పోసి చంపేస్తామని బెదిరించారు. పోలీసులు విచక్షణారహితంగా హింసించడంతో రాత్రి రెండు గంటల వరకు స్పృహ తప్పి పడిపోయింది. సునీత కుమారుడు జగదీశ్వర్ ను కూడా కొట్టారు. ఆ తర్వాత ఫిర్యాదుదారుడు నాగేందర్ కారులోనే ఇంటికి పంపించగా.. ఈ విషయాన్ని మొత్తం సునీత తన ఎఫ్ ఐఆర్ లో పేర్కొన్నారు. నిరుపేద అయిన దళిత తనను తీవ్రంగా కొట్టిన రాంరెడ్డి ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags:    

Similar News