వెక్కిరిస్తున్న క్రీడా ప్రాంగణాలు.. గడ్డి మొక్కలతో దర్శనమిస్తూ..

గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి

Update: 2024-10-23 11:53 GMT

దిశ, చేవెళ్ల : గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని ప్రభుత్వం గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. చేవెళ్ల మండలంలోని గ్రామాలలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కేవలం బోర్డులకు పరిమితం అయ్యాయి. వాటిలో కనీసం గడ్డి మొక్కలు తీయడానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

క్రీడాకారులకు అందుబాటులో లేకుండా పోతుంది..

ప్రభుత్వం స్థలాని కేటాయించి ప్రాంగణ ఏర్పాటుకురూ. 2లక్షల నుంచి 5 లక్షల వరకు నిధులు మంజూరు చేసింది.ఇంత నిధులు ఖర్చు చేయగా ప్రస్తుతం వాటిని పట్టించుకోక పోవడంతో గడ్డి పిచ్చి మొక్కలతో వృధాగా దర్శనమిస్తున్నాయి.ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే అక్కడ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు.దీంతో కొన్ని గ్రామాలలో ఊరికి దూరంగా ఉండడం వల్ల క్రీడాకారులు ఉపయోగించుకోవడంలేదు.

క్రీడా ప్రాంగణంలో పరికరాల సమస్య..

గ్రామాలలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణంలో పరికరాలు సరిగా లేక వాటిని వినియోగించ డానికి వీలు లేకుండా పోయింది. మైదానలను కేవలం వంతుకు ఏర్పాటు చేసినట్టుగా ఏర్పాటు చేసి వదిలివేశారు. ప్రభుత్వం సీఎం కప్ పేరుతో మండలంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తోంది. ఇలాంటి పోటిలలో పాల్గొనేందుకు క్రీడాకారులకు సౌకర్యాలు లేకపోవడం శాపం గా మారింది. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అధికారులు క్రీడా ప్రాంగణాన్ని రన్నింగ్ ట్రాక్,వాలీబాల్ కోర్ట్, యువతకు కసరత్తులు చేసేందుకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలి. కానీ తూతూ మంత్రంగా మట్టి పోసి బోర్డులు ఏర్పాటు చేసి కేవలం వాలీబాల్ కు అవసరమైన స్తంభాలు ఏర్పాటు చేసి వదిలివేశారు.ప్రభుత్వం సూచించిన విధంగా ఏర్పాటు చేయడంలో అధికారులు వెనుకబడి ఉన్నారు.

దూరంగా ఉండటంతో ఇబ్బందులు..

మండలంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణలకు కేటాయించినా స్థలప్రభావంతో కూడా ఇబ్బందులు అవుతున్నాయి. చాలా చోట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శులు క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలం కావాలని రెవిన్యూ అధికారులను ఆడిగినప్పుడు రెవిన్యూ అధికారులు గ్రామ రెవిన్యూ పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ చూపించారు. అధికారులు అక్కడ క్రీడాప్రాంగణలను ఏర్పాటు చేశారు.దీంతో చాలా గ్రామాల్లో పంచాయతీకి దూరంగా ఉన్న భూమిలో ఏర్పాటు చేయడంతో వాటిని వినియోగించుకోవడానికి క్రీడాకారులకు చాలా ఇబ్బంది ఏర్పడింది. అధికారులు కేవలం తెలంగాణ ప్రాంగణం పేరుతో బోర్డులు ఏర్పాటు చేసి వదిలేసారు.

24 క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేసాము : ఎంపీడీఓ హిమబిందు

మండలంలో 37 గ్రామ పంచాయతీలలో 24 గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసాము. మిగతా గ్రామాలలో ప్రభుత్వ స్థలం అందుబాటులో లేక ఏర్పాటు చేయలేకపోయాము.

అధికారులు చొరవ తీసుకోవాలి : బోడ పవన్, వాలీబాల్ ఆటగాడు

గ్రామీణ యువతను క్రీడాల్లో రాణించడానికి గత ప్రభుత్వం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. యువతలో క్రీడా ను గుర్తించడానికి సీఎం కప్ పేరుతో ఆట పోటీలు కూడా నిర్వహిస్తోంది. కానీ మండలం లో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు ఊరికి దూరంగా ఉండడం, అక్కడ సరిపడా పరికరాలు లేక క్రీడాకారులకు ఉపయోగంగా లేకుండా పోతుంది. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తీసుకురావాలి.


Similar News