మౌనమెందుకు.. సాయి ప్రియ వెంచర్ ఆక్రమణలు తొలిగించరా?

మహేశ్వరం మండలంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న చెరువులు, కుంటలు, వాగులు రోజురోజుకూ మాయమైపోతున్నాయి.

Update: 2024-10-09 02:52 GMT

దిశ,రంగారెడ్డి బ్యూరో /మహేశ్వరం: మహేశ్వరం మండలంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న చెరువులు, కుంటలు, వాగులు రోజురోజుకూ మాయమైపోతున్నాయి. తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 144లో తిమ్మాయి చెరువు ( మఖ్తా చెరువు, తిమ్మాయి చెరువు, తిమ్మాజీ చెరువు) శిఖం సర్కారీ 34.05 ఎకరాల భూమి ఉంది. తిమ్మాయి చెరువు పక్కనే 145, 148, 149 సర్వేనెంబర్‌లో చెరువు ఎఫ్టీఎల్ పరిధి ఉంది. హెచ్ఎండీఏ సూచించిన మ్యాప్‌లో, ధరణిలో చూసిన తిమ్మాయి చెరువు ఎఫ్టీఎల్ పరిధి కంటికి స్పష్టంగా కనిపిస్తుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. కానీ ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులకు 145, 148, 149 సర్వేనెంబర్‌లో ఎఫ్టీఎల్ పరిధిలో చెరువు ఉందని కనిపించకపోవడం వెనుక ఆంతర్యం ఏదో దాగి ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిమ్మాయి చెరువు పూర్తి ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించాలని, తిమ్మాయి చెరువుపై కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

లావాణి భూమి ఆక్రమణ..?

సాయి ప్రియ వెంచర్ పక్కనే సర్వే నంబర్‌లో 137లో లావాణి భూమి ఉంది. వెంచర్ నిర్మాణం చేసే క్రమంలో లావాణి భూమిని సాయి ప్రియ వెంచర్ నిర్వాహకులు కొంత హద్దు భాగం ఆక్రమించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

రికార్డులో అవకతవకలు..

సర్వేనెంబర్ 145లో 1976 వరకు తిమ్మాజీ చెరువు (మఖ్తా చెరువు, తిమ్మాయి చెరువు)సెరుబా ఇనామ్ (దస్తు గర్దాన్ ఇనాం భూమి.. ఉర్దూ పదం) అప్పటి పహాణీలో ఉంది. తిమ్మాజీ చెరువు దస్తుగర్ధాన్ ఇనామ్ భూమికి ఓఆర్సీ ఏ విధంగా జారీ చేశారు. ఇనామ్ చట్టం ప్రకారం ఓఆర్సీని జారీ చేయాలంటే వాస్తవ ఇనామ్ దారులకు, వారసత్వంగా వారి కుటుంబ సభ్యులకు, అనుభవదారులకు, కౌలుదారులకు ఓఆర్సీని జారీ చేయాలి. కానీ చెరువు ఇనాం భూమికి ఏ విధంగా ఓఆర్సీని జారీ చేశారో రెవెన్యూ అధికారులే తెలపాలి.

ఇనామ్ భూములకు ఎసరు..

కుల వృత్తులకు, కవులకు, ఇతరత్రా సేవలను గుర్తించి బహుమతి (దానం) కింద ఇచ్చే భూములను ఇనాం భూములు అంటారు. సాయి ప్రియ వెంచర్ పూర్తిగా 145, 146, 147, 148, 149, 150 దస్తుగర్ధాన్ (1955-1995) ఇనామ్ భూముల్లో ఉంది. ఇనాం దారులకు, సాగుదారు కాలంలో ఉన్న అనుభవదారులకు ఓఆర్సీలు జారీ కాలేదు. దస్తుగార్ధన్ లో అక్రమంగా ఓఆర్సీలు జారీ అయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఇనాం, అనుభవదారుల పేర్ల మీద కాకుండా ఇతర వ్యక్తుల పేరిట ఓఆర్సీలు జారీ అయ్యాయి. సాయి ప్రియ వెంచర్ నిర్వాహకులు ఇనాం భూములను కొనుగోలు చేశారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వెంచర్ చేసే క్రమంలో తుమ్మలూరు గ్రామానికి చెందిన రాజకీయంగా పలుకుబడి ఉన్న పెద్ద మనుషులు దస్తుగర్ధన్ లో పట్టాదారులతో, అనుభవదారులతో సంతకాలు పెట్టించి వెంచర్ నిర్వాహకులకు అండగా నిలిచి అమాయకులను మోసం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇరిగేషన్ , రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం..?

మహేశ్వరం మండలంలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని పలుమార్లు ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులకు విన్నవించినా వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాలకు గురైన చెరువులపై ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు దృష్టి పెట్టాలని మహేశ్వరం మండల ప్రజలు కోరుతున్నారు.


Similar News