ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన వైనం

Update: 2024-08-13 05:02 GMT

దిశ,అబ్దుల్లాపూర్మెట్ః రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కడం సంచలనం రేపుతోంది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి నుంచి 8 లక్షల లంచం తీసుకుంటుండగా ఓఆర్ ఆర్ పరిధిలో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. జక్కిడి ముత్యంరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతోనే జాయింట్ కలెక్టర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ముత్యంరెడ్డి తనకున్న 14 గుంటల భూమిని ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి తొలగించాలని కోరాడు. అయితే సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి అందుకోసం ఎనిమిది లక్షలు డిమాండ్ చేశాడని తెలుస్తోంది. దీంతో సదరు ముత్యంరెడ్డి ఇదే విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ముత్యంరెడ్డి నుంచి మధుమోహన్ రెడ్డి కారులో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పాడు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్.

దాంతో తమ ముందే జాయింట్ కలెక్టర్ కు ఫోన్ చేయాలంటూ ఏసీబీ అధికారులు ఆదేశించడంతో.. మధు అలాగే చేశాడు. ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్ కు మధుమోహన్ ఫోన్ చేయడంతో.. పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్లో చెప్పాడు. పెద్దఅంబర్పేట్ వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా సోమవారం రాత్రి నుంచే అంబర్ పేట మున్సిపాలిటీ తట్టి అన్నారం ఇందు అరణ్య 156 జిల్లాలోని భూపాల్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లకుండా విచారణ సాగిస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదుతో పాటు పలు ఆస్తి పత్రాలు లభిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ దాడులలో ఏసీబీ సిటీ రేంజ్ 1 డీఎస్పి శ్రీనివాసరెడ్డి, ఇన్ స్పెక్టర్లు జానకిరామ్ రెడ్డి, నరేష్ ఇతర బృందం ఈ దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వివరాలను తొందరలో మీడియాకు వివరిస్తామని ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు.

Tags:    

Similar News