శంషాబాద్‌లో భారీ భూ కుంభకోణం..

తమకు అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు ఉంటే

Update: 2024-10-25 02:36 GMT

దిశ,శంషాబాద్ : తమకు అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు ఉంటే ఎన్ని కోట్ల ప్రభుత్వ భూమినైనా కబ్జా చేసి తీరుతామని సవాల్ విసురుతూ యథేచ్ఛగా శంషాబాద్ మున్సిపాలిటీ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఏకంగా రూ.100 కోట్ల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కబ్జా రాయుళ్లు ప్రయత్నించారు. శంషాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో ఇక్కడ భూముల ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో ఇక్కడ ఎకరం భూమి లక్షలు పలుకగా, ఇప్పుడు తాజాగా ఒక ఎకరం ధర రూ.20 కోట్లపై మాటే. దీంతో కబ్జా రాయుళ్లు బరితెగిస్తూ ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించిన గద్దల్లా వాలిపోతూ కబ్జాలకు పాల్పడుతున్నారు.

తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే 626 సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమి ఉంది. దీని పక్కనే ఉన్న వెంచర్లు ఒక గజం ధర రూ.60 వేలు పలుకుతుంది. దీంతో కబ్జా రాయుళ్లు కన్ను 626 సర్వేనెంబర్ లోని 7 ఎకరాల పై పడింది. గతంలో రెవెన్యూ అధికారులు ఈ ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయినా కబ్జా రాయుళ్లు బరితెగించి రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డును సైతం తొలగించి రాత్రికి రాత్రి కంచె వేస్తూ జేసీబీ, ట్రాక్టర్లతో చదును మొదలుపెట్టారు. ఇదేంటని పక్కనే ఉన్న స్థానికులు ప్రభుత్వ భూమిలో మీరు ఎలా పనులు చేస్తారని అడగడంతో మీకేంటి సంబంధం అని బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు వాపోతున్నారు.

దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా రాయుళ్లు బరితెగించి కబ్జా చేస్తుంటే రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు పట్టించుకోరా? అని వాపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ మున్సిపల్ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడి కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనికి సహకరించిన ప్రజాప్రతినిధులు, నాయకులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. రూ.100 కోట్ల విలువ చేసే 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా అయిన భూమిని కాపాడడానికి హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని స్థానికులు తెలిపారు.

పనులు నిలిపివేశాం..

కబ్జా చేసిన భూమిలో పనులు చేస్తుండడంతో వాటిని నిలిపివేశామని శంషాబాద్ తహశీల్దార్ రవీందర్ దత్ తెలిపారు. శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని రాల్లగూడ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్న 626 సర్వే నంబర్‌లో 7 ఎకరాల ప్రభుత్వ భూమిలో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు రావడంతో అక్కడికి వెళ్లి వెంటనే పనులు నిలిపివేశామన్నారు. ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా ఏర్పాటు చేశామని, దాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో అనంతయ్య, భీమ్ రావ్ పేర్లపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామన్నారు. వారిపై ల్యాండ్ గ్రామర్, క్రిమినల్ కేసులు నమోదు చేయించామన్నారు. ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడేనా..?

ఇటీవల ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, నాలాలే కాకుండా ప్రభుత్వ భూములను కాపాడడానికి ప్రత్యేకంగా ఒక హైడ్రా కమిటీని తీసుకొచ్చి దూకుడు పెంచారు. దీంతో చెరువులు, కుంటలు, నాల కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటే.. మరోపక్క కబ్జా రాయుళ్లు రూటు మార్చి ప్రభుత్వ భూములపై కన్ను వేశారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. శంషాబాద్ రెవెన్యూ పరిధిలో దాదాపు రూ.100 కోట్ల విలువచేసే 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా రాయుళ్ల చెర నుంచి కాపాడి కబ్జారాయుళ్ల పై కఠిన చర్యలు తీసుకొని కబ్జా చేయాలంటే వారిపై కఠిన చర్యలు ఉండాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News