సీజనల్ వ్యాధులపై దృష్టిపెట్టాలి

సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శశాంక డాక్టర్లకు ఆదేశించారు.

Update: 2024-09-25 15:03 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో : సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ శశాంక డాక్టర్లకు ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నందున ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.

    చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి కేసులు నమోదైన వెంటనే ఆ కుటుంబాన్ని డాక్టర్లు పరిశీలించి వారికి వైద్యపరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య శాఖ అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రతిరోజూ సందర్శించాలని, సమయపాలన పాటించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులు నమోదైన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారు. అక్కడి వారికి రక్త నమూనాలను సేకరించి వ్యాధులను నిర్ధారించి మందులను అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రాకేష్, డాక్టర్ పాపారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, ఇతర డాక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News