vice chancellor : వ్యవసాయ కోర్సుల ప్రవేశాలలో ప్రైవేటు సంస్థల మాయాజాలం లో పడొద్దు

వ్యవసాయ కోర్సుల ప్రవేశాలలో ప్రైవేటు సంస్థల మాయాజాలంలో పడొద్దని పిజెటిఎస్ఎయూ వైస్ ఛాన్సలర్ ఆల్డాస్ జానయ్య పేర్కొన్నారు.

Update: 2024-10-27 10:45 GMT

దిశ, శంషాబాద్ : వ్యవసాయ కోర్సుల ప్రవేశాలలో ప్రైవేటు సంస్థల మాయాజాలంలో పడొద్దని పిజెటిఎస్ఎయూ వైస్ ఛాన్సలర్ ఆల్డాస్ జానయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక్కదానికే ఏ గ్రేడ్ తో కూడిన ఐకార్ గుర్తింపు ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనార్ధం ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు తెలిపారు. గుర్తింపులేని ప్రైవేటు కళాశాలలతో పిజెటిఎస్ఎయూకు ఎలాంటి సంబధం లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయలో సీట్లు ఇప్పిస్తామని ప్రచారం చేసుకునే దళారుల మాటలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోవద్దని తెలిపారు. అలాంటి వ్యక్తులు, సంస్థలతో విశ్వవిద్యాలయానికి ఎలాంటి సంబంధం, భాగస్వామ్యం లేదని వివరించారు. ప్రవేశాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన సూచించారు.

ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోటాలో ఫీజులు భారీగా తగ్గించడమే కాకుండా సీట్లు కూడా పెంచామని పెంచిన సీట్లను కౌన్సెలింగ్ ద్వారా ప్రతిభ ఆధారం గానే పిజెటిఎస్ఎయూ రెగ్యులర్, ప్రత్యేక కోటా లో ప్రవేశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.ఎటువంటి మధ్య దళారీలు, కన్సల్టెంట్ ల పైన ఆధార పడవద్దని, వారి మాయ మాటలని నమ్మవద్దని ఉపకులపతి మరోసారి సూచించారు. ఇతర అనధికారిక వెబ్ సైట్ లలో లభ్యం అయ్యే సమాచారానికి విశ్వవిద్యాలయానికి సంబంధం లేదని తెలిపారు. పెంచిన ప్రత్యేక కోటా సీట్ల భర్తీ కోసం ప్రస్తుతం ఆన్లైన్లో దరఖాస్తులు నవంబర్ 1 వ తేదీ వరకు స్వీకరిస్తున్నామని.. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన సమాచారం కోసం తల్లితండ్రులు, విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ సైట్ www.pjtsau.edu.in మాత్రమే చూడవలసిందిగా వైస్ ఛాన్సలర్ జానయ్య సూచించారు.


Similar News