జల్సాల కోసం అప్పులు…వాటిని తీర్చేందుకు చోరీలు

ఆన్లైన్ బెట్టింగులలో డబ్బులు పోగొట్టుకొని జల్సాల కోసం అప్పులు చేస్తూ వాటిని తీర్చడానికి ఉన్నత చదువులు చదువుతున్న విద్యావంతులే చోరీల బాట పడుతున్నారని ఏసీపీ కెవిపి రాజు ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2024-10-15 09:14 GMT

దిశ, యాచారం : ఆన్లైన్ బెట్టింగులలో డబ్బులు పోగొట్టుకొని జల్సాల కోసం అప్పులు చేస్తూ వాటిని తీర్చడానికి ఉన్నత చదువులు చదువుతున్న విద్యావంతులే చోరీల బాట పడుతున్నారని ఏసీపీ కెవిపి రాజు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలోని ఏసీపీ కార్యాలయం ఆవరణలో 10వ తేదీన ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి నోరు మూసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగల వివరాలను వెల్లడించారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం, పెద్దంబర్ పేట్ గ్రామం, మైత్రిలహరి కాలనీలో నివాసముంటూ బీ.టెక్ 3వ సంవత్సరం చదువుతున్న పూటుకూరి ప్రభాస్, (20) ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని, జల్సాలకు అప్పులు చేసి వాటిని తీర్చేందుకు సులువుగా డబ్బులు సంపాదించాలని భావించాడు.

తనకు ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన స్నేహితుడు నల్లగొండ జిల్లాకు చెందిన గుండ్లపల్లి శివ, (19)తో కలిసి ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధుల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేయాలని పథకం వేసుకున్నారు. బ్లూ కలర్ బాలెనో కారు రెంటుకు తీసుకొని ఆకులమైలారం గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న దేవరశెట్టి సుమతమ్మ ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు. అర్ధరాత్రి డోర్ కొట్టి ఇంటి తలుపులు తీయగానే నోరు మూసి 6 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించుకుని పారిపోయారు. మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, ఆదేశంతో సీఐ కృష్ణంరాజు, ఎస్సై తేజం రెడ్డి, యాచారం మంచాల పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో బెలినో కార్ కోహెడ గ్రామంలో తిరుగుతున్నట్లు గుర్తించారు.

చాకచక్యంగా దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి 4 బంగారు గాజులు, 2 తులాల పుస్తెలతాడు, ఆభరణాలను కట్ చేయడానికి ఉపయోగించిన కత్తెర, బ్లూ కలర్ బాలెనో కార్, ఐఫోన్, 13 మొబైల్ ను స్వాధీనం చేసుకొని దొంగలను రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇండ్ల వద్ద ఒంటరిగా ఉండే మహిళలు రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు డోర్లు కొడితే తీయవద్దని, యువకులు ఆన్లైన్ బెట్టింగులకు దుర్వ్యసనాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏసీపీ సూచించారు. 4 రోజులలోనే దొంగలను పట్టుకున్న సీఐ కృష్ణంరాజు, ఎస్సై తేజం రెడ్డి, కానిస్టేబుళ్లు సుందరయ్య, ఇంతియాజ్, శేఖర్ శ్రీను ప్రభులను అభినందిస్తూ రివార్డులను అందజేశారు.


Similar News