పోడు భూములపై పారదర్శకంగా సర్వే చేయాలి : అదనపు కలెక్టర్​ తిరుపతి రావు

జిల్లాలో పోడు వ్యవసాయం భూముల సర్వే పారదర్శకంగా, వివాదాలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు సంబంధించిన అధికారులను ఆదేశించారు.

Update: 2022-10-10 15:17 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: జిల్లాలో పోడు వ్యవసాయం భూముల సర్వే పారదర్శకంగా, వివాదాలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు సంబంధించిన అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు పోడు భూములకు సంబంధించిన సర్వే పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తిరుపతి రావు మాట్లాడుతూ గ్రామ సభలు నిర్వహించి స్వీకరించిన పోడు భూముల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే చేపట్టాలని సూచించారు.

సర్వే నిర్వహణ సమయంలో సంబంధిత అధికారులు తప్పనిసరిగా తమ వెంట చెక్ లిస్ట్ తీసుకుని వెళ్ళాలని, సూచించిన నమూనా ఫారంలో పూర్తిస్థాయి వివరాలను నింపాలని అన్నారు. మొబైల్ యాప్ లో సర్వేకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని, పోడు వ్యవసాయ భూముల సర్వే క్షేత్రస్థాయిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, అటవీ శాఖలు సమన్వయంతో గ్రామస్థాయిలో పర్యటించి 2005 సంవత్సరానికి ముందు నుంచి అన్యాక్రాంతం అయిన పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులు, 3 తరాల నుంచి సాగు చేస్తున్న గిరిజనేతరుల దరఖాస్తులు గ్రామస్థాయి కమిటీలో వారి సమక్షంలో సర్వే చేపట్టాలని, ఆయా స్థాయి కమిటీలో తీర్మానాలను రిజిస్టర్లను పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు.

జీపీఎస్ ద్వారా సరిహద్దు వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని, నిర్ణీత మొబైల్ యాప్ లో పోడు రైతులకు సంబంధించి వివరాల నమోదు జరగాలని అన్నారు. సర్వే కొరకు నియమించిన బృంద సభ్యులు వారికి కేటాయించిన గ్రామాల, ఆవాసాల సంపూర్ణ సమాచారం ముందస్తుగా కలిగి ఉండాలని సూచించారు. భవిష్యత్తులో అటవీ భూమి ఆక్రమణలకు గురికాకుండా అడవుల పునర్జీవనానికి పటిష్ట చర్యలు చేపట్టాలని, అటవీ రక్షణ చట్టం పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

పోడు భూముల సర్వే సమాచారం ముందస్తుగా దరఖాస్తుదారులకు అందజేయాలని, వారి సమక్షంలో భూమిపై జీపీఎస్ మ్యాప్ వినియోగిస్తు 7,8 చోట్ల జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలని, వాటితొ పాలిగన్ డ్రా చేయాలని, ఆ మ్యాప్ ఫోటో, భూవిస్తీర్ణం వివరాలు, దరఖాస్తుదారుని కుటుంబ ఫోటో, 2 ప్రభుత్వ గుర్తింపు కార్డులు యాప్ లో నమోదు చేయాలని, మొబైల్ యాప్ ద్వారా ఆఫ్ లైన్ లో సైతం వివరాలు నమోదు చేసే అవకాశం ఉందని, అంతర్జాలం అందుబాటులో వచ్చిన తర్వాత సర్వర్ కు తప్పనిసరిగా సింక్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ జాదవ్ కిషన్, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారిణి రామేశ్వరి దేవి, ఈడీఎం నాగభూషణం, అటవీ, రెవెన్యూ అధికారులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News