బీఆర్ఎస్ త‌ల‌చుకుంటే కాంగ్రెస్ క‌నుమ‌రుగు: మేడే రాజీవ్ సాగ‌ర్

కాంగ్రెస్ పార్టీ తాటాకు చ‌ప్పుళ్లకు భ‌య‌ప‌డ‌బోమని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగ‌ర్ స్పష్టం చేశారు.

Update: 2024-10-01 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ తాటాకు చ‌ప్పుళ్లకు భ‌య‌ప‌డ‌బోమని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగ‌ర్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ పై దాడిని మంగళవారం మీడియా ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పై 10నెల‌ల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేక‌త వ‌చ్చింద‌న్నారు. వాటి నుంచి ప్రజ‌ల‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికే ప్రతిపక్ష నేతలపై దాడులే చేస్తున్నారని విమ‌ర్శించారు. మ‌ళ్లీ ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృత‌మైతే ప్రతి చర్యతప్పదని హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అని ప్రగాల్భాలు ప‌లికి స‌ర్కార్ ను ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ ఎమ‌ర్జెన్సీ పాల‌న‌ను తెలంగాణ‌లో తీసుకువ‌చ్చార‌ని గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ మండిపడ్డారు. రౌడీ రాజ‌కీయాల‌కు పాల్పడితే కాంగ్రెస్ పార్టీని మూసీలో క‌ల‌ప‌డం ఖాయ‌మ‌ని హెచ్చరించారు.

రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. గుండా రాజ్యం నడుస్తుందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్ అన్నారు. మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో కేటీఆర్ పై దాడిని ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది కీలక పాత్ర అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని.. గుండా రాజ్యం నడుస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రజల హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.


Similar News