Ponnam: దసరా రోజు అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం.. మంత్రి పొన్నం ఆసక్తికర సందేశం

"ప్రమాదం చెప్పి రాదు.. వచ్చాక చెప్పడానికి ఎవరు ఉండరు" అని, ఈ దసరా పండుగ రోజు అందరం ఒక ప్రతి చేద్దామని తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Update: 2024-10-10 06:03 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: "ప్రమాదం చెప్పి రాదు.. వచ్చాక చెప్పడానికి ఎవరు ఉండరు" అని, ఈ దసరా పండుగ రోజు అందరం ఒక ప్రతి చేద్దామని తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ట్విట్టర్ వేదికగా వీడియో సందేశం ఇచ్చిన ఆయన ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రిగా.. ఒక తల్లికి బిడ్డగా ఒక్క మాట చెబుతా దయచేసి వినాలని కోరారు. రోడ్డు ప్రమాదాల ద్వారా భారతదేశంలో సంవత్సరానికి సగటున 1.60 లక్షల మంది చనిపోతున్నారని, అదే తెలంగాణలో సగటున రోజుకి 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని తెలిపారు.

ప్రమాదం చెప్పిరాదు కనుక మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన బాధ్యత మనదేనని చెప్పారు. దసరా చెడు పై మంచి విజయం సాధించిన దానికి గుర్తుగా కుటుంబ సభ్యులందరం కలిసి ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దామని అన్నారు. "ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందాం" అని అందరూ ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేశారు. మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదానికి సూచిక అంటూ.. అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు అని చెప్పారు. ఇక చివరగా ఒక భద్రత సందేశం వేల మంది ప్రాణాలు కాపాడుతుందని తెలిపారు.


Similar News