Government Adviser Shabbir Ali : బడ్జెట్ లో మహిళల భద్రత ఊసెత్తని ప్రభుత్వం..

నిర్మలమ్మ బడ్జెట్‌ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పెదవి విరిచారు.

Update: 2024-07-23 14:46 GMT

దిశ, కామారెడ్డి : నిర్మలమ్మ బడ్జెట్‌ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పెదవి విరిచారు. దేశంలో మైనార్టీలు, దళితులు, మహిళలు తమ భద్రత పై ఆందోళన చెందుతున్నారని, కానీ బడ్జెట్‌లో మహిళల భద్రత ఊసెత్తలేదని ఆరోపించారు. ఆంధ్ర, బీహార్ కు ప్రకటించిన దాంట్లో తెలంగాణకు 25 శాతం కూడా నిధులు ప్రకటించలేదన్నారు. వారికి ఎందుకిచ్చారు అని మేము అడగటం లేదని, మాకు కూడా న్యాయం చేసి సమానంగా నిధులు ప్రకటించి వుంటే బాగుండేదన్నారు. మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా పథకాలను తీసుకొస్తున్నామంటున్నా వాటి అమలు పై మాత్రం శ్రద్ధ కనబరచడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించాం.. దక్కింది శూన్యం అని మండిప‌డ్డారు. బ‌డ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్ర‌స్తావ‌న లేక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. రూ.48 లక్షలు ఇరవై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం వాళ్లు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి దక్కింది శూన్యమే అని పేర్కొన్నారు. రాష్ట్రం నుండి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచినా కేంద్రం మాత్రం తెలంగాణకు చిన్నచూపు చుసిందని, ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదని తెలిపారు. ఐఐఎం సహా నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇస్తారేమో అని ఎదురుచూసిన ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు.

తెలంగాణ నుంచి ముంబై - నాగపూర్, బెంగళూరు - చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదన్నారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినా కూడా కేంద్రం స్పందించలేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అన్ని శాఖల మంత్రులను అడిగినా వాటిని కూడా పట్టించుకోలేదన్నారు. తెలంగాణలో 8 స్థానాలను బీజేపీకి ఇస్తే ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలన్నారు. బీజేపీ ఎంపీలు, ఇద్ద‌రు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్‌లో మాట్లాడ‌లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడ కూడా తెలంగాణ అనే పదం ప్రస్తావించలేదని గుర్తు చేశారు. ధరల మంటను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల నిత్యావసరాల కొనుగోలు శక్తి క్రమంగా తగ్గుముఖం పడుతుందన్నారు.

Tags:    

Similar News