రెండున్నర గంటలుగా మొరాయించిన ఈవీఎం.. మూడోవ ఈవీఎంతో ప్రారంభమైన ఓటింగ్

Update: 2023-11-30 07:35 GMT

దిశ, భిక్కనూరు: సుమారు రెండున్నర గంటల పాటు ఈవీఎంలు మొరాయించడంతో.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని 140 పోలింగ్ బూత్ వద్ద గంటల కొద్ది ఓటర్లు క్యూలో నిల్చున్నారు. ఓటర్లు ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలకు ఈ బూత్‌లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే ఈవీఎం మొరాయించింది. రిపేర్ చేయించినప్పటికీ అది పని చేయకపోవడంతో, రెండవ ఈవీఎంను తీసుకొచ్చి పెట్టారు. అది కూడా మొరాయించడంతో దాన్ని సరి చేసే ప్రయత్నం చేశారు.

కానీ అది కూడా పనిచేయకపోవడంతో మూడవ ఈవీఎం ను తీసుకొచ్చి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పెట్టారు. దీంతో పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే చాలామంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లు గంటలక కొద్ది క్యూలో నిల్చోలేక వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈవీఎం పని చేస్తుందని తెలియడంతో మళ్లీ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.


Similar News