సరిహద్దు వాగు సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్లో గ్రామస్తుల ఆందోళన

ఏళ్ల తరబడి ఉన్న తమ ఇరు గ్రామాల సమస్య పరిష్కరించాలంటూ వేల్పూర్ మండలం జానకంపేట గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో ఆందోళన చేపట్టారు.

Update: 2024-02-19 07:10 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: ఏళ్ల తరబడి ఉన్న తమ ఇరు గ్రామాల సమస్య పరిష్కరించాలంటూ వేల్పూర్ మండలం జానకంపేట గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో ఆందోళన చేపట్టారు. పచ్చల నదుకుడ గ్రామస్తులు కావాలని సమస్యను సృష్టిస్తున్నారని జానకంపేటకు చెందిన గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇరు గ్రామాలకు సంబంధించిన ఈ సరిహద్దు వాగు విషయంలో ఆర్మూర్ ఆర్డీవో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా పచ్చల నడుకుడ గ్రామస్తులకు ఏకపక్షంగా మద్దతునిస్తూ తమను తమ గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారని జానకంపేట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే తమ ఇరు గ్రామాల మధ్య ఉన్న ఈ వాగు సమస్యను అధికారులు పరిష్కరించి గ్రామాల మధ్య శాంతిభద్రతలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అదేవిధంగా పచ్చల నడుకుడ గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కావాలని తమ గ్రామంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అధికారులపై ఒత్తిడి తెస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత ఆర్డిఓ ప్రజావాణి లోకి వచ్చి తమ సమస్యను పరిష్కరించే విధంగా స్పష్టమైన హామీ ఇవ్వాలని గ్రామస్తులు బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది.


Similar News