నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మురుగునీరు సరఫరా
మంచినీరు ప్రతి ఒక్కరూ రోజువారీ కార్యక్రమంలో అవసరమైందే.
దిశ, నిజామాబాద్ సిటీ: మంచినీరు ప్రతి ఒక్కరూ రోజువారీ కార్యక్రమంలో అవసరమైందే. అయితే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతినిత్యం వేల లీటర్లు ప్రజలకు సరఫరా చేసే మంచి నీటి విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు.. నిజామాబాద్ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్ తన సోషల్ మీడియా ఐన ట్వీటర్ ఎక్స్లో ఈ పోస్టు పెట్టడం జరిగింది. కల్తీ గా వస్తున్న మున్సిపల్ నీరును ప్రజలు తాగవద్దని ఈ నీటిని తాగితే ప్రాణాంతక వ్యాధులు డయేరియా అలాంటివి కొన్ని తెచ్చుకోవాల్సిందేనని ఆయన ఆ పోస్టులో వెల్లడించారు. ఇప్పటికే ఈ డయేరియా బారిన పడిన బాధితులు కేసుల సంఖ్య అధికమవుతున్నాయని ఆయన సూచించారు. నెలలు తరబడి వివిధ వాటర్ ట్యాంకులు మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. మున్సిపల్ వాటర్ ట్యాప్ ఓపెన్ చేస్తే చాలు మురుగునీరు దుర్గందమైన వాసన వెదజల్లుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ఇటు వైపు దృష్టి సారించి నాణ్యమైన నీటిని సరఫరా చేసి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని ఆయన కోరారు.