Raging : నగ్నంగా ఆరో తరగతి పిల్లాడిపై ర్యాగింగ్ ..చివరికి ఏం జరిగిందంటే..?

ఆరో తరగతి విద్యార్థిని ర్యాగింగ్ చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సాంఘిక సంక్షేమ ఆశ్రమ కళాశాలలో సోమవారం వెలుగు చూసింది.

Update: 2024-10-28 14:49 GMT

 దిశ భిక్కనూరు : ఆరో తరగతి విద్యార్థిని ర్యాగింగ్ చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సాంఘిక సంక్షేమ ఆశ్రమ కళాశాలలో సోమవారం వెలుగు చూసింది. స్నానం చేసి బయటకు వచ్చిన విద్యార్థి టవాల్ గుంజేసి... నగ్నంగా ఉంచి తోటి విద్యార్థులు నవ్వుకోవడమే కాకుండా..డార్మెటరీ గది నుంచి బయటకు రాకుండా గొళ్ళెం పెట్టారు. వివరాల్లోకి వెళితే... కామారెడ్డి మండలం టేక్రియాల్ కు చెందిన స్వస్తిక్ కోమల్ అనే విద్యార్థి ఆరవ తరగతి(బి )చదువుతున్నాడు. అదే తరగతికి చెందిన ఆరేడుగురు విద్యార్థులు కోమల్ ను రెండు రోజుల క్రితం ఈవ్ టీజింగ్ చేశారు. దీపావళికి మీ అయ్యను కార్టన్ బీర్లు తీసుకురమ్మని చెప్పు, 50 ,100 ఇవ్వాలంటూ తోటి విద్యార్థులు టార్చర్ చేస్తుండడంతో.. భరించలేక సదర్ విద్యార్థి జరిగిన విషయాన్ని ఏడుస్తూ క్లాస్ టీచర్ కు చెప్పేశాడు. ఉపాధ్యాయుల అనుమతితో వారి గ్రామం నుంచి వచ్చిన పేరెంట్స్ తో కలసి తన స్వగ్రామానికి వెళ్ళాడు. జరిగిన విషయం అంత తన తల్లిదండ్రులకు చెప్పి, ఇక ఆ స్కూల్లో నేను చదవలేనని చెప్పి ఏడ్చాడు. దీంతో వారి తల్లిదండ్రులు స్వప్న, రాజులు ఈరోజు ఆశ్రమ పాఠశాలకు చేరుకొని, ప్రిన్సిపాల్ రఘు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో ఇంత దారుణ ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని, మీరు వచ్చిన తరువాతనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి పేరెంట్స్ కమిటీ సభ్యులు కూడా కళాశాలకు చేరుకున్నారు. అయితే దాడిలో గాయపడిన విద్యార్థి స్వస్తిక్ కోమల్ చెబుతున్న మాటలు పూర్తి గా అబద్ధమని, కళాశాల ఉపాధ్యాయులు మొదట లైటుగా తీసుకొని, కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తల్లిదండ్రులు మాత్రం స్కూల్ పేరెంట్స్ కమిటీకి సమాచారం అందించి వారందరిని స్కూల్ కు రమ్మని పిలిపించారు. భోజన సమయం తరువాత పేరెంట్స్ కమిటీ సభ్యులు, ప్రిన్సిపాల్ రఘు, ఉపాధ్యాయుల సమక్షంలో ర్యాగింగ్ కు పాల్పడిన ఏడెనిమిది మంది విద్యార్థులను అందరి సమక్షంలో వారి వద్దకు పిలిపించి, మీరు ఏమాత్రం భయపడకుండా జరిగిన విషయం చెప్పాలని మిమ్మల్ని ఎవరు ఏమి చేయరని వాస్తవాలు చెప్పాలని బుజ్జగిస్తూ అడిగారు. దీంతో మొదట విద్యార్థులు అబద్దాలు చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, ఒకరిద్దరు పేరెంట్స్ కమిటీ సభ్యులు సమన్వయంతో వ్యవహరించి వాస్తవాన్ని ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థుల నోటితోనే బయటకు చెప్పించారు. చివరకు ఇదంతా జోక్ గా చేశామంటూ అసలు నిజాన్ని ఒప్పుకోవడం కొసమెరుపు.

సస్పెండ్ చేద్దామనుకున్నా... వెనక్కి...

ఈవ్ టీజింగ్ కు పాల్పడిన విద్యార్థులను టీసీ ఇచ్చి పంపించాలని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే పేరెంట్స్ కమిటీ సభ్యులు కొందరు తొందరపడవద్దని నచ్చజెప్పారు. ప్రిన్సిపాల్ మాత్రం వారిని వారం రోజులపాటు సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటానని పేరెంట్స్ కమిటీ సమావేశంలో చెప్పగా.. ఇప్పుడు వారిని సస్పెండ్ చేస్తే ఇష్యూ డైవర్ట్ అయి మరో తలనొప్పిని తెచ్చిపెడుతుందని పేరెంట్స్ కమిటీ సభ్యులు ముందుచూపుతో ఆలోచించి సస్పెండ్ చేయవద్దని అభ్యర్థించారు. అయితే బాధిత విద్యార్థి మాత్రం నావల్ల వీరందరూ ఇబ్బంది పడడం తనకు ఇష్టం లేదని, నేను ఇక్కడ చదవనంటే చదవనని, పాఠశాలలో ఉండలేనని తేల్చి చెప్పాడు. రెండు నెలల క్రితం పాఠశాలలో చదువుతున్న ఐదవ తరగతి విద్యార్థికి సైతం ఇదే విధమైన పరిస్థితి తలెత్తిందని విద్యార్థి పేరెంట్ వాపోయాడు. చివరకు పేరెంట్స్ కమిటీ సభ్యులు బాధిత విద్యార్థి తల్లిదండ్రులను ఒప్పించి ఇక్కడే చదువుకునే విధంగా పేరెంట్స్ కమిటీ సభ్యులు కన్వినెన్స్ చేశారు.

ఇకముందు జరగకుండా చూసుకుంటా....

పాఠశాలలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ప్రిన్సిపాల్ రఘు పేరెంట్స్ కమిటీ సభ్యుల సమావేశంలో చెప్పారు. పాఠశాల విద్యార్థులపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ అనునిత్యం ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.


Similar News