శేట్పల్లి సంగారెడ్డి గ్రామంలో పోలీసుల లాఠీ ఛార్జ్

Update: 2023-11-30 05:08 GMT

దిశ, లింగంపేట్: లింగంపేట మండలం శేట్పల్లి సంగారెడ్డి గ్రామంలో గురువారం ఉదయం పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించారు. శేట్పల్లి సంగారెడ్డిలో పోలింగ్ బూత్ వద్ద ఓటర్లకు స్లిప్పు అందించడానికి ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద జనాలు గుమ్మిగూడి ఉండడంతో.. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు లాఠీచార్జ్ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికి ఆయా పార్టీల నాయకులు, జనాలు గుమిగూడి ఉండడం పట్ల పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించారు.

ఈ క్రమంలో గ్రామానికి చెందిన నాయకులతోపాటు గ్రామస్తులకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేయడం పట్ల గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన జెల్ల దుర్గయ్య తలకు గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే గ్రామ సర్పంచ్ అనిల్ రెడ్డి, నాయకులు మోహిద్, కిరణ్ కుమార్‌లకు సైతం గాయాలయ్యాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం పట్ల గ్రామస్తులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


Similar News