ఆవిరైన నరేందర్ ఆశలు...కొనసాగనున్న ఏసీబీ విచారణ

దాదాపు 25 ఏళ్లుగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏకచత్రాధిపత్యంగా తన హవాను నడిపిస్తున్న మున్సిపల్ రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ ప్రాభవం ఒక్క ఏసీబీ రైడ్ తో కకావికలమైంది.

Update: 2024-08-10 16:29 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దాదాపు 25 ఏళ్లుగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏకచత్రాధిపత్యంగా తన హవాను నడిపిస్తున్న మున్సిపల్ రెవెన్యూ అధికారి దాసరి నరేందర్ ప్రాభవం ఒక్క ఏసీబీ రైడ్ తో కకావికలమైంది. ఇన్నాళ్లు అవినీతి సొమ్మును కట్టపై కట్ట గుట్టలుగా పేర్చిన సొత్తంతా తన కళ్లముందే ఏసీబీ అధికారులు సీజ్ చేస్తుండగా నిస్సహాయంగా చూస్తూ నరేందర్ మౌనంగా రోదించినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు తన అక్రమార్జనతో కూడబెట్టిన సొమ్మునంతా పోగుచేసి ఇప్పటికే బినామీ పేర్లతో పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు కొనడమే కాకుండా, పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి స్లీపింగ్ పాట్నర్ గా కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా కొద్దికొద్దిగా కూడ పెట్టిన డబ్బు దాదాపు రూ. 3 కోట్లతో హైదరాబాద్​లోని రిచ్ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీలో ఓ ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్ ను

    కొనుగోలు చేసేందుకు బేరసారాలు నడుస్తున్నాయని సమాచారం. ఆ ప్లాట్ ను కూడా తనకు నమ్మకమైన వ్యక్తుల పేరున బినామీగా కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు, వారం రోజుల్లో పూర్తి నగదును ముట్టజెప్పి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈలోపు అనుకోకుండా ఏసీబీ రైడ్ ఉప్పెనలా పడడంతో నరేందర్ ఆశలు ఆవిరి అయిపోయినట్లు సమాచారం. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా దాదర్ ఏరియాలో డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కోసం గత కొంతకాలంగా తన సమీప బంధువులతో చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. అంతా సక్రమంగా జరిగితే రెండు వారాల్లో హైదరాబాద్​లోని గేటెడ్

    కమ్యూనిటీలో ప్లాట్ కొనుగోలు జరిగిపోయేదని, ముంబైలో కూడా డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ కు కూడా డబ్బులు చెల్లింపులు జరిగిపోయేవని సమాచారం. ఇంట్లో పెద్ద మొత్తంలో దాచుకున్న డబ్బు నిలువలను బయటకు ఎలా తీసుకెళ్లాలో అర్థం కాక, ఇంతకాలం డబ్బును ఇంట్లోనే దాచినట్లు చర్చించుకుంటున్నారు. నరేందర్ వద్ద దొరికిన అక్రమ సంపాదన కన్నా అధిక మొత్తంలో ఇంకెక్కడో ఉండి ఉంటుందని ఏసీబీ అధికారులు బలంగా నమ్ముతున్నారు. అన్ని కోణాల్లో వారు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో నరేందర్ ను ఏసీబీ అధికారులు కోర్టుకు రిమాండ్ చేసినప్పటికీ తిరిగి పూర్తిస్థాయి విచారణ కోసం మళ్లీ తమ కస్టడీలోకి తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నరేందర్ బంధువుల జాబితాను, స్నేహితులు సన్నిహితుల జాబితాను ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించినట్లు సమాచారం. ఏసీబీ అధికారుల బృందం ముంబై కూడా వెళ్లి విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 

Tags:    

Similar News