బీసీల రిజర్వేషన్లపై ఉద్యమించాలి

స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీలందరూ ఐకమత్యంగా ఉద్యమించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు.

Update: 2024-09-10 12:27 GMT

దిశ, ఆర్మూర్ : స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీలందరూ ఐకమత్యంగా ఉద్యమించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్లో గల ఎమ్మార్ గార్డెన్ లో మంగళవారం బీసీల సదస్సు బీసీల నాయకుడు, ఉద్యమ నేత రాజారామ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడారు. చట్టసభలతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేక బీసీలు రగులుతున్నారన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా అవసరమైతే మిలిటెంట్ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే ఉద్యమాలతోనే రిజర్వేషన్లు సాధ్యమవుతాయన్నారు. దేశవ్యాప్తంగా సంపన్న వ్యాపార వర్గాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 16 లక్షల కోట్లను మాఫీ చేసిందని వివరించారు. వీరికి మాఫీ చేసిన విధంగానే ప్రతి బీసీ కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షలు రుణమిచ్చి ప్రోత్సహించాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరుస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డికి బీసీల రిజర్వేషన్ల పై చిత్తశుద్ధి లేదన్నారు.

    చిన్న కులపోళ్లని చిన్నచూపు చూస్తే ఉద్యమించి తడాఖా చూపిస్తామన్నారు. అనంతరం మరో ముఖ్య అతిథి విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ బీసీలు క్రమక్రమంగా రాజ్యాధికారాన్ని కోల్పోతున్నారన్నారు. బీసీల జనాభా 61 శాతం ఉంటే కేవలం 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. 3 శాతం రెడ్డి సామాజిక వర్గం ఉంటే 43 మంది ఎమ్మెల్యేలు, వెలమ జనాభా 70 వేలు ఉంటే 13 మంది ఎమ్మెల్యేలు, కమ్మ సామాజిక వర్గం ఒక శాతం ఉంటే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. 61 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజ్యాధికారం లేక అణచివేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ గడ్డ విప్లవాల అడ్డ అని, ఈ ప్రాంతం నుంచే బీసీల ఉద్యమం ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తుందన్నారు.

    బీసీ నాయకుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జంతువుల లెక్కలు తీసే ప్రభుత్వాలు బీసీల జనాభా లెక్కలు ఎందుకు సేకరించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను దుర్మార్గంగా అణచి వేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీసీలందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో రిజర్వేషన్ల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో బీసీ నాయకులు దేగాం యాదగౌడ్, మహిపాల్ యాదవ్, మోతే రామాగౌడ్, అబ్బగోని అశోక్ గౌడ్, కొండ వీటి శ్యాంప్రసాద్, భాస రాజేశ్వర్, సుధాకర్ పటేల్, మందుల పోశెట్టి, వీర కుమార్, రాజేందర్, శ్రీధర్, షాహిద్, ప్రకాష్ గౌడ్, అరుణ జ్యోతి, లక్ష్మీనారాయణ గౌడ్, ఎస్ ఆర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News