భార్యను వేధించిన భర్త, అతని స్నేహితుడు.. కట్ చేస్తే..

భర్త, అతని స్నేహితుడు పెట్టే బాధలు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది.

Update: 2024-09-23 16:17 GMT

దిశ, కామారెడ్డి : భర్త, అతని స్నేహితుడు పెట్టే బాధలు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని హోసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న రంగా రాణి, గంగాధర్ గౌడ్ లకు ఇద్దరు సంతానం. అయితే తరచుగా రంగారాణి భర్త గంగాధర్ గౌడ్ శారీరకంగా, మానసికంగా వరకట్నం తేవాలని వేధింపులకు గురిచేశాడు. వైజాగ్ లో ఉంటున్న గంగాధర్ గౌడ్ స్నేహితుడు సతీష్ సైతం వీరితోనే ఉంటూ గంగాధర్ గౌడ్ తో కలిసి రాణీని చిత్రహింసలకు గురిచేస్తూ చేతులు కట్టేసి కర్రలతో కొట్టేవారు.

ఈ నెల 6న వేధింపుల విషయం రాణి తన తల్లిదండ్రులకు తెలిపింది. భర్త, అతని స్నేహితుడు కొట్టిన విషయాన్ని మనసులో ఉంచుకున్న రాణి అదే రోజు పురుగుల మందు తాగినట్టుగా తల్లిదండ్రులకు చెప్పడంతో నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని వెల్నెస్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 21 న నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించే లోపు మృతి చెందింది. మృతురాలు రాణి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త గంగాధర్ గౌడ్, అతని స్నేహితుడు సతీష్ లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారని ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.


Similar News