జీజీహెచ్ బాలుడి కిడ్నాప్..చివరికి ఏమైందంటే..?

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) లో భద్రత వైఫల్యం మరో మారు బయటపడింది.

Update: 2024-10-19 14:41 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) లో భద్రత వైఫల్యం మరో మారు బయటపడింది. జీజీహెచ్ లో భద్రత గాలిలో దీపం లాంటిదేనని మరో సారి రుజువైంది. ఆస్పత్రిలో కరువైన భద్రత పట్ల ఎన్ని విమర్శలు వస్తున్నా తుడుచుకొని తేలిగ్గా తీసుకుంటున్న తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ నుంచి పాటు ఎడాది వయసున్న బాలుడు అపహరణకు గురవడం కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ అనారోగ్య కారణాలతో.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తన భర్త రాజు, కొడుకు మణికంఠ తో కలిసి వచ్చింది. ఆసుపత్రి డాక్టర్లు ఆమెను పరీక్షించి వైద్యం కోసం ఇన్ పేషెంట్ గా చేర్చుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యకు అటెండెంట్ గా ఆమె భర్త రాజు ఆసుపత్రిలోనే ఉన్నాడు. శుక్రవారం రాత్రి ఏడాది వయసు ఉన్న తన కొడుకు మణికంఠతో కలిసి ఆసుపత్రిలో నిద్రపోయారు. వీరు గాఢ నిద్రలో ఉండగా.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రిలోకి చొరబడి తండ్రి పక్కలో నిద్రిస్తున్న మణికంఠను ఎత్తుకెళ్లి పోయారు. శనివారం ఉదయం నిద్రలేచాక రాత్రి తనతో పాటు తన పక్కన పడుకున్న కొడుకు కనిపించకపోయేసరికి రాజు ఒక్కసారిగా టెన్షన్ కు గురయ్యాడు. తన భార్య దగ్గర ఉన్నాడేమోనని అక్కడ కూడా వెతికి, ఆస్పత్రి ఆవరణలో అంతా వెతికినా తన కొడుకు కనిపించలేదు. ఈ విషయాన్ని ఎక్కడున్నా సెక్యూరిటీ గార్డులు, వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. జి జి హెచ్ లో బాలుడికి కిడ్నాప్ వ్యవహారం బయటపడింది. సీఐఎస్ఎఫ్ బలగాలు, పోలీసు సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, నీట్ వాచ్ మెన్లు, ఆస్పత్రి సిబ్బంది ఇంతమంది ఆస్పత్రిలో ఉండగా..నిర్భీతిగా ముగ్గురు అపరిచితులు ఆస్పత్రిలోకి చొరబడి బాలుడిని కిడ్నాప్ చేయడంపై జి జి హెచ్ ఆసుపత్రి వర్గాలు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉందని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఇదే తరహాలో కిడ్నాప్ జరిగింది.

ఏడాది కాలంలో ఏక రీతిలో జరిగిన కిడ్నాప్ వ్యవహారం ఇది రెండోది కావడం గమనార్హం. శుక్రవారం జరిగిన కిడ్నాప్ వ్యవహారం ఆస్పత్రిలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు అధికారులు తెలిపారు. సిఐఎస్ఎఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు కాపలా ఉండగానే బాలుడి కిడ్నాప్ కు గురికావడం, భద్రత బలగాల నిర్లక్ష్యం, నిఘాలో డొల్లతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి స్పందించాలని, జి జి హెచ్ లో తరచూ జరుగుతున్న పిల్లల కిడ్నాప్, అక్రమాల వ్యవహారాలపై స్పందించి.. చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ జనరల్ అసుపత్రిలో రక్షణ వ్యవస్థలో డొల్లతనంపై మీడియాలో తరచూ కథనాలు వస్తున్నా..ప్రజల నుంచి రోగుల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాణాలు దక్కించుకోవడానికి ఆసుపత్రికి వెళితే ప్రాణంగా భావించే పిల్లలను కిడ్నాపర్లకు బలి ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. భద్రతా వైఫల్యంపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏదైనా సంఘటన జరిగితే, అప్పటికప్పుడు హడావిడి చేసి తరువాత నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆస్పత్రిలో జరిగిన బాలుడు కిడ్నాప్ వ్యవహారంపై స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా.. పోలీసులు విచారణ చేపట్టారని తెలిసింది. జిజిహెచ్ లో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంపై ఆసుపత్రిలో భద్రతపై రోగుల్లో విశ్వాసం పోతుంది. ఓ పక్క పేద ప్రజలకు ఖరీదైన, నాణ్యమైన వైద్యాన్ని సక్సెస్ ఫుల్ అందించినప్పుడల్లా ప్రెస్ మీట్ లు ఏర్పాటుచేసి, ప్రచారం చేసుకుంటున్న అధికారులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అసలేం జరగనట్టు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దీనిపై విచారణ జరిపించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


Similar News