సభ్యత్వ నమోదులో కామారెడ్డి ముందుండాలి.. ఎంపీ గోడం నగేష్

బీజేపీ సభ్యత్వ నమోదులో దేశంలోనే కామారెడ్డి నియోజకవర్గం ముందంజలో ఉండాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు.

Update: 2024-09-09 10:00 GMT

దిశ, కామారెడ్డి : బీజేపీ సభ్యత్వ నమోదులో దేశంలోనే కామారెడ్డి నియోజకవర్గం ముందంజలో ఉండాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, పార్టీని బలోపేతం చేయాలన్నారు. మోడీ నాయకత్వం దేశానికి అవసరమని ప్రజలు గుర్తించారని, అందుకే మూడోసారి ప్రధానిగా అవకాశం ఇచ్చారన్నారు.

10 సంవత్సరాల క్రితం అభివృద్ధిలో, మౌళిక వసతుల కల్పనలో 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ విఫలమైందని, ఉచిత బియ్యం, ఉచిత గ్యాస్, ముద్ర రుణాల వంటి సంక్షేమ పథకాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. బీజేపీలో సభ్యునిగా చేరడం ప్రతి ఒక్కరికి గౌరవమన్నారు. సభ్యత్వ నమోదులో దేశంలోనే కామారెడ్డి నియోజకవర్గం మొదటి స్థానంలో నిలుస్తుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 8 నెలల క్రితం, మాజీ, ప్రస్తుత సీఎంలను ఓడించిన గొప్ప కార్యకర్తలు ఇక్కడ ఉన్నారని కొనియాడారు. బీజేపీలో సభ్యత్వం కొత్త కార్యక్రమం కాదని, అలాగని మొక్కుబడిగా సభ్యత్వం చేయవద్దని, బాధ్యతగా ముందుకు వెళ్లాలని సూచించారు. యువతను అత్యధికంగా సభ్యత్వంలో భాగస్వామ్యం చేయాలన్నారు. తెలంగాణలో 2028లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

టార్గెట్ పెట్టుకోవాలి.. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి

కామారెడ్డి నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వం చేసేదిశగా ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం సభ్యత్వంలో ముందంజలో ఉండాలని, అందులో కామారెడ్డి జిల్లా ముందు వరుసలో ఉండాలని, జిల్లాలో అత్యధికంగా కామారెడ్డి నియోజకవర్గంలో సభ్యత్వం ఎక్కువ ఉండాలన్నారు. నియోజకవర్గంలో 33 వేల సభ్యత్వం చేసే లక్ష్యంగా పని చేయాలన్నారు. అనంతరం సభ్యత్వ నమోదు పై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీపాటిల్, జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పదాధికారులు, నియోజకవర్గాల అసెంబ్లీ కన్వీనర్లు పాల్గొన్నారు.


Similar News