ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగేలా చూడాలి

యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు.

Update: 2024-03-26 09:50 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, ఐకేపీ సీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ 1 వ తేదీ నుండి జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో యాసంగిలో సాధారణానికి మించి అధిక విస్తీర్ణంలో వరి పండించారని, 11.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేతికందుతుందని అంచనా వేశామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈసారి జిల్లాలో 462 కొనుగోలు

    కేంద్రాల ద్వారా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు. వీటిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో 417 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 39, మెప్మా ఆధ్వర్యంలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిస్థాయిలో మద్దతు ధర పొందేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం 'ఏ' గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ. 2203, సాధారణ రకానికి రూ. 2183 ధర చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ రైతులకు అవసరమైన అన్నిమౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తగిన నీడ, నీటి వసతి కల్పించాలన్నారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

    నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తి స్థాయి మద్దతు ధర అందేలా చూడాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఇదివరకటి తరహా నియమ, నిబంధనలే అమలులో ఉంటాయని, అయితే ఈసారి కొత్తగా సెకండ్ ఓటీపీలో ఐరిస్ ను కాప్చర్ చేయడం జరుగుతుందని వివరించారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమిష్టిగా, సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపరచాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతుల నుండి ఏ చిన్న ఫిర్యాదు సైతం రాకుండా చూసుకోవాలని, ధాన్యం సేకరణలో క్షేత్రస్థాయి అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ముఖ్యంగా ధాన్యం రవాణాకు సరిపడ సంఖ్యలో వాహనాలను సమకూర్చుకోవాలని, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటవెంట జరిగేలా అవసరమైన సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలని,

    కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ చేసేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, బాగా ఆరబెట్టిన, శుభ్రపర్చిన ధాన్యం మిల్లులకు పంపాలని అన్నారు. కాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కొనుగోలు కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో ప్రారంభోత్సవాలు చేయించకూడదని, అధికారులు ప్రారంభించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఫ్లెక్సీలలో కూడా ఫోటోలు ఉండకూడదని, కేవలం రైతులకు ఉపయోగపడే సూచనలు మాత్రమే ముద్రించాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. నాణ్యతా ప్రమాణాలను సాకుగా చేసుకుని రైతులను నష్టపర్చే ప్రయత్నాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న

    అంశమైనందున ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటవెంట రైస్ మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. కాగా, రైతులు దళారులకు ధాన్యం కట్టబెట్టి మోసపోకుండా, ప్రభుత్వపరంగా ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో డీఎస్ఓ చంద్రప్రకాశ్, సివిల్ సప్లయిస్ డీఎం జగదీశ్, జిల్లా మార్కెటింగ్ అధికారిణి గంగూబాయి, సహకార శాఖ అధికారి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. 


Similar News