ఒకే పోస్ట్ ... ఇద్దరికి బాధ్యతలు.. ఇదేం బదిలీలలు?

నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలల్లో అక్రమాలు జరుగుతున్నాయని పలువురు టీచర్లు ఆరోపిస్తున్నారు..

Update: 2024-07-07 03:13 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ అంతా సక్రమంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా అందుకు విరుద్దంగా నడుస్తున్నట్లు పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. బదిలీలలో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని,. ఈ విధానాన్ని అమలు పరుస్తున్న విద్యాశాఖ అధికారుల తీరును పలువురు ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ షెడ్యూల్‌ ప్రకటించిన తరువాత అక్రమ బదిలీలు చేపట్టడంపై మండిపడుతున్నారు. అక్రమ బదిలీలతో అన్యాయం జరిగిందని ఉపాధ్యాయసంఘాల నేతలు వాపోతున్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు జిల్లా విద్యాశాఖ అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పదోన్నతుల విషయంలో గతంలో జరిగిన జాబితా లేదని చెప్పిన అధికారులు బదిలీల్లోకంప్యూటర్ మిస్టేక్‌ల పేరిటతప్పిదాలకు దారి తీశారు. అంతకన్నా కొందరి ఒత్తిడితో ఏకంగా బదిలీలు జరిగి విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు మళ్లీ రీ పోస్టింగ్‌లు ఇచ్చిన ఘనతను నిజామాబాద్ విద్యాశాఖ మూటగట్టుకుంది.

ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు వెబ్ ఆప్షన్ల ద్వారా నిర్వహించడం తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలో బయోలాజికల్ సైన్స్ (లోకల్ బాడీ ) తెలుగు మీడియం సబ్జెక్టులో మొదటగా సర్క్యూలర్ 1 ప్రకారం కె. పద్మజ అనే ఉపాధ్యాయురాలు జెడ్పిహెచ్ఎస్ సారంగపూర్ లో గత నెల 18న రిలీవ్ అయి, ఆమెకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అలాట్ అయిన జెడ్పీఎస్ఎస్ కొండూరు (సిరికొండ మండలం)లో 19న హెడ్ మాస్టర్‌కు రిపోర్ట్ చేసి జాయిన్ కావడం జరిగింది. ఇది ఇలా ఉండగా రెండు రోజులు అనంతరం సర్క్యూలర్ 2 ప్రకారం టి. శైలజ అనే ఉపాధ్యాయురాలు జాయిన్ అయిన వేరే జడ్పిహెచ్ఎస్ పాఠశాల (ధర్పల్లి)నుoడి విడుదల కాకుండానే కే. పద్మజ పనిచేస్తున్న జెడ్పీఎస్ఎస్ కొండూరు పాఠశాలలో 21న హెడ్ మాస్టర్ ఆమెను జాయిన్ చేసుకోవడం, ఆమె చేత 19,20 (జూన్) రెండు తేదీలలో కూడా సంతకం పెట్టించడం జరిగింది. కే.పద్మజని జెడ్పీహెచ్ఎస్ కొండూరు పాఠశాలకు వెళ్లాలని, రాత పూర్వక ఉత్తర్వులు విడుదల చేసేది లేదని ఇది డీఈఓ మౌఖిక ఆదేశాలు అని చెప్పుతూ గత నెల 21 నుండి నేటి వరకు కే. పద్మజ చేత హాజరు రిజిస్టర్ లో సంతకాలు పెట్టించకుండా వేధించడం జరుగుతున్నది.

విద్యా శాఖ తప్పుడు మోడిఫికేషన్ వల్ల ఒక్క పోస్టులో ఇద్దరు పని చేసే పరిస్థితి తలెత్తింది వెబ్ ఆప్షన్ లో ఏదైనా ఒక పాఠశాల అలాట్ అవుతది, కానీ రెండు వేరువేరు పాఠశాలలో ఒకరికి ఎలా అలాట్ జరిగింది. అంటే మాడిఫికేషన్లు జరిగినాయినడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇట్టి విషయాన్ని సూచిక మూడు ప్రకారము కె. పద్మజ విద్యాశాఖాధికారులకు మూడుసార్లు తన సమస్యను న్యాయంగా పరిష్కరించాలని ఇచ్చిన విజ్ఞప్తులపై స్పందన కరువైంది. ప్రస్తుతం కె. పద్మజ సొంతంగా ఒక హాజరు రిజిస్టర్ ను తయారు చేసుకొని పాఠశాలకు హాజరైన రోజులలో సంతకాలు చేసుకోవడం విశేషం. కె .పద్మజకు నిబంధనల మేరకు న్యాయం చేయాలని, గెజిటెడ్ హెడ్మాస్టర్ నిబంధనలు పాటించకపోవడం, అధికార దుర్వినియోగం కారణంగా ఆమె గత 15 రోజులుగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి తోడు మీరు సమస్యను పరిష్కరించకుండా పదే పదే తమ కార్యాలయానికి పిలిపిస్తూ అనధికార వ్యక్తులతో సలహాలు ఇప్పిస్తూ, ఒత్తిడి చేయడం అభ్యంతరకరమని అందుకు పూర్తి బాధ్యత జిల్లా విద్యాశాఖ అధికారి వహించవలసి ఉంటుందని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ తరపున రాష్ట్ర అధ్యక్షులు శాంతన్ తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే పాఠశాల విద్యా సంచాలకులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో ఒకటే పోస్టు ఇద్దరు టీచర్లకు ఇచ్చిన వైనంపై ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని తెలిపారు.


Similar News