లింగ నిర్ధారణ ఆరోపణలు.. ప్రభుత్వ వైద్యుడు డా. ప్రవీణ్‌కు షాక్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లింగ నిర్ధారణ చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ వైద్యుడు డా. ప్రవీణ్ కు షాక్ తగిలింది.

Update: 2024-10-03 03:55 GMT

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లింగ నిర్ధారణ చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ వైద్యుడు డా. ప్రవీణ్ కు షాక్ తగిలింది. ఆయనను డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ కు సరెండర్ చేస్తూ జిల్లా వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 6న జిల్లా కేంద్రంలోని సమన్విత ఆస్పత్రిలో పోసానిపేట గ్రామానికి చెందిన మహిళకు లింగ నిర్ధారణ పరీక్షలు జరపడంతో పాటు 8 నెలల సమయంలో ఆపరేషన్ చేసి సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తికి శిశువును విక్రయించడంలో ఆస్పత్రి వైద్యులు డా. ప్రవీణ్, డా. సిద్ది రాములు, ఆస్పత్రి సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో వైద్యాధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు.

అయితే కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని మళ్ళీ ఆస్పత్రిని కొనసాగిస్తున్నారు. అరెస్టైన వైద్యులు బెయిల్ పై బయటకు వచ్చి మళ్ళీ విధులు నిర్వహిస్తున్నారు. అయితే డా. ప్రవీణ్ గాంధారి మెడికల్ ఆఫీసర్‌గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. శిశు విక్రయం, లింగ నిర్ధారణ కేసులో సదరు వైద్యునికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వివరణ ఇవ్వాలని మెమో జారీ చేసినా సరైన విధంగా స్పందించలేదని సమాచారం. దీంతో డా. ప్రవీణ్‌ను డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో సదరు వైద్యున్ని సస్పెన్షన్ చేసే అవకాశాలు ఉన్నట్లు వైద్యశాఖలో చర్చ జరుగుతోంది. సస్పెన్షన్ వేటు వేస్తారా..? లేక మళ్ళీ సంజాయిషీ కోసం మెమో ఇచ్చి వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది.


Similar News