వివేకానంద విద్యా పథకంతో ఉన్నత విద్యకు చేయూత
బ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం విశేష కృషి చేసిందని విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
దిశ, చందానగర్ : బ్రాహ్మణుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం విశేష కృషి చేసిందని విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నిరుపేద బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్య కోసం వివేకానంద విద్యా పథకం ద్వారా ఆర్థిక చేయూతను అందించి ఆదుకుందన్నారు. శ్రీ వేద వ్యాస సేవా సంస్థ భాగ్యనగర్ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకులు కలగ రాఘవ నేతృత్వంలో బ్రాహ్మణుల కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని మియాపూర్లోని నరేన్ గార్డెన్స్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు,
సామూహిక సత్యనారాయణ వ్రతాలు, గౌరీ నోము కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, ప్రణీత్ సంస్థల అధినేత కామరాజు నరేంద్ర, మాజీ కార్పొరేటర్ కాండూరి నరేంద్రాచార్య, ఆనంద్ సూర్య సహా పలువురు ప్రముఖులతో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ధూప దీప నైవేద్యం పథకం ద్వారా ఎన్నో దేవాలయాలకు పునరుజ్జీవం లభించిందన్నారు. నియోజకవర్గంలో బ్రాహ్మణ కుటుంబాలకు తాను అన్ని విధాలా అండదండగా నిలుస్తానని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో మూర్తి, సోమయాజులు, శివ, సురేష్ జోషి , వేద వ్యాస సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.