నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు.. వరద గేట్ల ద్వారా 24,500 క్యూసెక్కుల నీటి విడుదల

Update: 2024-09-27 14:45 GMT

దిశ,నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా దిగువకు 24,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈఈ శివప్రసాద్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరదనీరు ప్రాజెక్టులోకి , ఇన్ ఫ్లో గా వచ్చి చేరుతుందని, అలాగే సింగూరు ప్రాజెక్టు ద్వారా 21,500 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో గా వస్తుందని తెలిపారు.

శుక్రవారం ఆయన ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు, 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1404.98 అడుగులు , 17.773 టీఎంసీల నీటి నిల్వతో కొనసాగుతుందని, ఎగువ ప్రాంతం నుండి వరద ప్రవాహం కొనసాగుతున్నందున ప్రాజెక్టు మూడు వరద గేట్లు ఎత్తివేసి 24,500 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి వదిలిపెడుతున్నట్లు ఏఈఈ తెలిపారు. అదేవిధంగా వాగులు,వంకలు,కూడా వరద నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు, గొర్ల కాపర్లు మంజీరా వైపు వెళ్లే నీటి ప్రవాహంలోకి దిగరాదని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.


Similar News