రైతులకు వరంగా బిందు సేద్యం..తక్కువ నీటితోనే అధిక విస్తీర్ణంలో పంటల సాగు..

ప్రస్తుతం రైతులు అనుసరించే సంప్రదాయ విధానాల వల్ల ఎక్కువ

Update: 2024-10-22 03:14 GMT

దిశ,తాడ్వాయి : ప్రస్తుతం రైతులు అనుసరించే సంప్రదాయ విధానాల వల్ల ఎక్కువ నీటితో, తక్కువ భూమికి నీరు పారించే పరిస్థితి ఉండేది.దీనివల్ల నీటి వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది.దీనికి తోడు తరచూ వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవటంతో, నీటి ఎద్దడితో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఈ గడ్డు పరిస్థితులను అధిగమించి, సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని సమర్ధవంతంగా పెంచేందుకు మండలానికి చెందిన రైతులు బిందుసేద్యం వైపు మొగ్గు చుస్తూ అధిక లాభాలు గటిస్తున్నారు. మండలంలో ప్రధానంగా బావుల ద్వారానే పంటలను సాగు చేస్తున్నారు.దీంతో నీరు పొదుపుగా వాడి ఎక్కువ మొత్తంలో పంటలు సాగు చేస్తున్నారు.సులభ పద్ధతిలో వ్యవసాయం చేసి,తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు తీస్తున్నారు.తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుకు సూక్ష్మ,తుంపర సేద్యం.. లాభాలకు మార్గం నీ రైతులు నూతన పద్ధతుల వైపు మళ్లుతున్నారు.ఎగుడు, దిగుడుగా ఉన్న నేలల్లోనూ పంటలు పండించవచ్చు. నీరు వర్షంలా పడడంతో వాతావరణం చల్లగా మారి అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటను కాపాడుకోవచ్చు.

స్ప్రింక్లర్ లో రకాలు..

స్ప్రింక్లర్లలో ఇంపాక్ట్‌ స్ప్రింక్లర్లు, మైక్రో స్ప్రింక్లర్లు, పార్ట్‌ సర్కిల్‌ స్ప్రింక్లర్లు, పర్‌ ఫోరేటెడ్‌పైపులు, జెట్‌ స్ప్రింక్లర్లు, పాపప్‌ స్ప్రింక్లర్లు, రెగ్యులేటెడ్‌ స్ప్రింక్లర్లు తదితర రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని భూమిలో పాతిపెట్టడం, కొన్ని పైపులు భూమి లోపల ఉంచి మిగతా పరికరాలను బయట ఉంచడం, ఇక స్ప్రింక్లర్‌ పైపులన్నీ భూమిపైనే ఉంచి నీరందించడం జరుగుతుంది.ఇందుకు ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ,బీసీలకు 90 శాతం, ఇతరులకు 80శాతం సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలను ప్రభుత్వం అందిస్తున్నది.ఉద్యానవన అధికారులు ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ చేస్తారు.

బిందు, తుంపర సేద్యంతో ప్రయోజనాలు..

పొలం గట్లు, కాల్వలు, మడులు చేయాల్సిన అవసరం లేదు. నీరు వృథా కాదు.తరచూ నీటిని అందించడం వల్ల పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది.స్ప్రింక్లర్‌ పద్ధతితో మొక్కల వేళ్ల వరకే నీరు అందుతుంది. ఇసుక నేలల్లో ఈ పద్ధతి ఎంతో మేలు. నీటి తుంపర్ల వల్ల భూమిపై నీరు నిల్వ ఉండదు.మట్టి గడ్డ కట్టదు.అవసరమైన నిష్పత్తి లో నీరు,గాలి భూమిలో ఉంటూ విత్తనాలు ఆరోగ్యంగా మొలకెత్తి పంట దిగుబడి పెరుగుతుంది. ఎగుడు, దిగుడుగా ఉన్న నేలల్లోనూ పంటలు పండించవచ్చు.

మంచి దిగుబడులు సాధించవచ్చు.. : ఎర్రవట్టి రాజు యువ రైతు, తాడ్వాయి

తక్కువ శ్రమ, తక్కువ నీటి వినియోగం తో పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చు. డ్రిప్‌, స్ప్రింక్లర్లతో పంటకు సరిపడా నీటిని అందించవచ్చు.డ్రిప్‌, స్ప్రింక్లర్లను ఆరుతడి పంటల సాగు కోసం వాడుకోవాలి.తక్కువ నీటితో కరువులోనూ పంటలు వేసి లాభాలు పొందాను.

పంటకు సరిపడా నీరు.. : అశ్వవార్ధన్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉద్యానవన అధికారి

బిందు, తుంపర సేద్యంతో పంటకు సరిపడా నీరు అంది ఏపుగా పెరుగుతుంది. దిగుబడులు సాధారణం కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. తక్కువ నీటి వనరులు ఉన్నా మెట్ట ప్రాంతాల్లో డ్రిప్‌, తుంపర సేద్యానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు.తుంపర సేద్యం ఆరుతడి పంటలకు ఎంతో మేలు.


Similar News