అవినీతి మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఇంటికి పంపాలి

నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం నుంచి అవినీతి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఇంటికి పంపి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ ను బంపర్ మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలని తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, సినీనటి విజయశాంతి అన్నారు.

Update: 2023-11-25 15:56 GMT

దిశ ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం నుంచి అవినీతి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఇంటికి పంపి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ ను బంపర్ మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలని తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, సినీనటి విజయశాంతి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ మండల కేంద్రంలో శనివారం రాత్రి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గం ప్రజలు అవినీతి మంత్రిని ఓటు అనే వజ్రాయుధంతో తరిమికొట్టాలని కోరారు. పదేళ్లుగా కేసీఆర్ పాలనలో ప్రజలు అరిగోసలు పడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అక్కడి ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుందని, డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని, తరువాత 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని, రైతు భరోసా ద్వారా ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు ఎకరానికి 15000 పెట్టుబడి సాయం,

     రైతు కూలీలకు 12000 సాయం ప్రతి సంవత్సరం అందిస్తామని, పసుపు పంటకు 12,000 మద్దతు ధర, వరి పంటకు క్వింటాలుకు 500 బోనస్, ప్రతి పంటకు మద్దతు ధరలు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆడపిల్లలకు 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళా ఖాతాలో ప్రతినెలా 2500 రూపాయలు జమ చేస్తామన్నారు. చేయూత పథకం ద్వారా వృద్ధాప్య పింఛను 4000, వికలాంగ పింఛను 6000 అందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, 2024లో జాబ్ క్యాలెండర్ ను ఇప్పటికే మేనిఫెస్టోలో ప్రకటించినట్లు చెప్పారు. విద్యా భరోసా

    పథకం ద్వారా చదువుకోవడానికి 5 లక్షల సాయం, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం బాల్కొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ.. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, కోట్ల రూపాయల దోపిడీ చేసి తెలంగాణ ప్రజలను నిలువునా ముంచారని, తెలంగాణ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రశాంత్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని చేయడం పట్ల ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


Similar News