చదువులమ్మ ఒడిలో తనువులు చాలిస్తున్నారు..! సూసైడ్ స్పాట్‌గా మారిన గోదావరి బ్రిడ్జి

జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే వారికి బాసర గోదావరి బ్రిడ్జి అడ్డా‌గా మారింది.

Update: 2024-04-10 05:24 GMT

దిశ, నవీపేట్: జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే వారికి బాసర గోదావరి బ్రిడ్జి అడ్డా‌గా మారింది. గలగల పారే గోదారమ్మలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. చదువులమ్మ ఒడిలో ఓనమాలు దిద్దిన విద్యార్థులే గంగమ్మలో తనువులు చాలిస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యం, చదువులో వెనుకబాటు కారణం ఏదైనా పరిష్కారం ఆత్మహత్యే అని భావిస్తున్న అభాగ్యులు బాసర గోదావరి బ్రిడ్జినే ఎంచుకుంటున్నారు. సరస్వతి మాత అనుగ్రహంతో జీవితంలో ఉన్నత స్థాయి రావాల్సిన వారు గోదారిలో దూకి కాటికి పోతున్నారు.

ప్రతి సంవత్సరం సుమారు 20 నుంచి 30 మంది వరకు ఆత్మహత్యయత్నానికి పాల్పతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాల నుంచి అభాగ్యులు గోదావరి పరిసరాల్లో దూకి ప్రాణాలు పోగొట్టుకున్న కేసులు ఇటు నవీపేట్, అటు బాసర పోలీస్ స్టేషన్లలో అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ మధ్యనే ఎంసెట్ కోచింగ్ తరగతులు అర్థము కావడం లేదని, పేరెంట్స్ ఆశలు తీర్చలేకపోతున్నాననే ఆవేదనతో నవీపేట్ మండలం నాగేపూర్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సూర్యతేజ గోదావరి‌లో దూకి ప్రాణాలు తీసుకున్నాడు.

ఈ ఘటన మరువకముందే హైదరాబాద్‌కు చెందిన వైష్ణవ్ మంగళవారం నాడు గోదావరి లో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం‌లో స్థానిక యంచ గ్రామ యువకులు రక్షించారు. గతంలో నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకొని కన్నవారికి, కుటుంబానికి తీరని శోకం మిగిల్చారు. ప్రతి సంవత్సరం సుమారు 20మందికి పైగా, ఈ సంవత్సరం ఏప్రిల్ నెల వరకు సుమారు 10 మంది వరకు గోదారిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. కొన్ని పోలీసులకు సమాచారం లేకుండానే ఘటనలు జరుగుతున్నాయి. గత నెలలో నిజామాబాద్ గౌతమ్ నగర్‌కు చెందిన ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను గోదావరిలో తోసి తాను గోదావరి‌లో దూకిన వెంటనే చూసిన ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ స్పందించి జాలరులకు కేకలు వేయగా రక్షించారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్న పదుల సంఖ్యలో ప్రాణాలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం స్పందించకపోవడం‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాలకు తెగించి రక్షిస్తున్నారు..

తమ సమస్యలతో గోదావరి‌లో ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్న వారికి స్థానిక యంచ యువత, జాలర్లు ప్రాణాలు తెగించి కాపాడుతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 20 మంది గోదావరి బ్రిడ్జి పరిసరాల్లో గంగలో దూకేందుకు ప్రయత్నించే వారిని కాపాడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలా స్థానికుల, జాలర్ల కంటపడిన వారు ప్రాణాలతో బయటపడుతున్నారు. ఎవరూ గుర్తించని వారు తమ ప్రాణాలు వదులుతున్నారు.

ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి..

బాసర గోదావరిపై నవీపేట్ మండలంలోని యంచ నుంచి బాసర వరకు గల బ్రిడ్జిపై రక్షణ గోడ ఎత్తుగా లేక పోవడంతో ఆత్మహత్య చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. బ్రిడ్జి పై ఉన్న రక్షణ గోడ ఎత్తు తక్కువగా ఉండడంతో గోదావరి లో దూకడానికి అనువుగా ఉంది. యంచనుంచి బాసర వరకు గల బ్రిడ్జికి ఇరు వైపులా ఎత్తైన రక్షణ గోడ లేక ఫెన్సింగ్ ఏర్పాటుతో ఆత్మహత్య ప్రయత్నాలు తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇరు జిల్లాల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వీటితో పాటు పోలీస్ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ ఉంటే కొంతమేర ప్రాణాలు కాపాడొచ్చని స్థానికులు కోరుతున్నారు.

ఫెన్సింగ్, సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలి

గోదావరి బ్రిడ్జి వద్ద ఆత్మహత్యల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలి. గ్రామస్తులు, జాలర్లు బాధి‌తులను కాపాడుతున్నా.. ఎవరూ గుర్తించని వారు ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన వైష్ణవ్ ఆత్మహత్య ప్రయత్నం చేయగా మా గ్రామ యువకులు అడ్డుకొని బాసర పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్రిడ్జి వద్ద ఫెన్సింగ్ తోపాటు జాలీని ఏర్పాటు చేయాలి. వీటితోపాటు బ్రిడ్జిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. 

- ప్రవీణ్, యంచ


Similar News