ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
రబీ సీజన్ లో ధాన్యం సేకరణకు 446 కేంద్రాలను ఏర్పాటు చేశామని,

దిశ, కామారెడ్డి : రబీ సీజన్ లో ధాన్యం సేకరణకు 446 కేంద్రాలను ఏర్పాటు చేశామని, అధికారులు కొనుగోలు కేంద్రాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం కొనుగోలు కేంద్రాల అధికారులు, ఇంచార్జీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రానున్న యాసంగి సీజన్ లో 26 వేల ఎకరాల వరి పంట సాగు చేసినందున సుమారుగా 6.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాలకు 5.63 టన్నుల ధాన్యం రానున్నదని అంచనా వేశారు. అలాగే ప్రభుత్వ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేస్తూ కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ధాన్యం వచ్చిన ప్రాంతాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు.
అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రాల్లో తగినన్ని టార్పాలిన్లను ఏర్పాటు చేయాలనీ మార్కెటింగ్ శాఖ వారికి సూచించారు. ప్రతి కేంద్రంలో రైతులకు త్రాగునీరు, ఓఆర్ ఎస్ ప్యాకేట్స్, ఎండా తీవ్రతకు తగిన టెంట్లు ఏర్పాటు చేసుకోవాలని, సరిపడా తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్స్ అందజేయాలని కోరారు. జిల్లాకు కేటాయించిన ప్యాడి క్లినర్స్ ను సద్వినియోగం చేసుకోవాలని, అలాగే గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి క్వింటాలుకు కనీస మద్దతు ధర గ్రేడ్-ఏ రకానికి గాను రూ.2,320/-, కామన్ రకానికి రూ. 2,300/- మరియు సన్న రకం వడ్లకు చెల్లించాల్సిన 500/- బోనస్ కొరకు రైతులు తమ ధాన్యం వివరాలను ట్యాబ్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు.
24 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ 08468-220051 ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, డీసీఎస్.ఓ మల్లిఖార్జున బాబు, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారిణి రమ్య, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.