Delhi Doctors : జీజీహెచ్ లో క్షయ వ్యాధి నిర్మూలన కేంద్రం..

క్షయ వ్యాధి పై ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాధి నివారణ, నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 185 కేంద్రాలను ప్రారంభించిందని, ఇందులో భాగంగా వాటిలో నిజామాబాద్ లోని జీజీహెచ్ లో కూడా కేంద్రం ఏర్పాటు చేసిందని డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు.

Update: 2024-07-23 15:01 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : క్షయ వ్యాధి పై ప్రజల్లో అవగాహన కల్పించి వ్యాధి నివారణ, నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 185 కేంద్రాలను ప్రారంభించిందని, ఇందులో భాగంగా వాటిలో నిజామాబాద్ లోని జీజీహెచ్ లో కూడా కేంద్రం ఏర్పాటు చేసిందని డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో మంగళవారం న్యూఢిల్లీ నుంచి వచ్చిన డాక్టర్ల బృందంతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలో విస్తరిస్తున్న అనేక వ్యాధుల్లో ఈ క్షయ వ్యాధి కూడా ఒకటన్నారు.

ఇది మైకో బ్యాక్టీరియా ట్యూబర్ క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుందన్నారు. ఊపిరితిత్తులకు సంబంధించిన ఈ వ్యాధి చర్మం నుండి మెదడు వరకు శరీరంలోని ఏ భాగానికైనా వ్యాపించే అవకాశం ఉంటుందని డాక్టర్ అన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న దగ్గు, ఆకలిగా అనిపించకపోవడం, ఆకలి తగ్గడం, రాత్రిపూట చెమటలు రావడం, బరువు తగ్గడం, తగ్గినప్పుడు కఫంతో పాటు రక్తం రావడం, శ్వాస సరిగా ఆడక పోవడం, ఛాతి నొప్పి, అలసట వంటి లక్షణాలున్న వారు క్షయ వ్యాధి నిర్ధారణ టెస్టులు చేయించుకోవాలన్నారు. ఈ టెస్టులు జీజీహెచ్ లో ఉచితంగానే చేస్తారని డాక్టర్ ప్రతిమ పేర్కొన్నారు.

జీజీహెచ్ లో లెక్కకు మించి వస్తున్న ఔట్ పేషంట్ల సంఖ్యను గుర్తించి నిజామాబాద్ లో కూడా ఓ సెంటర్ ను ప్రారంభించారని ప్రతిమారాజ్ అన్నారు. 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలన కోసం భారతదేశం కృషి చేస్తుందన్నారు. జీజీహెచ్ ను సందర్శించేందుకు న్యూఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డాక్టర్ ప్రమోద్ రెడ్డి, డాక్టర్ పార్థసారథి, డాక్టర్ భరత్ కుమార్ ల బృందం నిజామాబాద్ కు వచ్చిందన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు.

Tags:    

Similar News